టీమ్ఇండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్!

posted on: Jun 5, 2026 9:10AM

టీమ్ ఇండియా టి20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ కు ఉద్వాసన పలికింది బీసీసీఐ. సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.  టీమిండియాకు ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేయనున్నారు. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపినప్పటికీ, అతనిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి,  మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా టీ20 పగ్గాలను అప్పగించాలని బీసీసీఐ దాదాపు నిర్ణయం తీసేసుకుంది. గురువారం (జూన్ 4) జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు   నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా వర్గాల సమాచారం. శనివారం (జూన్ 6) జరగబోయే సెలక్షన్ కమిటీ అధికారిక సమావేశంలో శ్రేయస్ అయ్యర్ కూడా   పాల్గొననుండటంతో, అతని నియామకంపై అధికారిక ముద్ర పడటం కేవలం లాంఛనమేనని అంటున్నారు. 

  2023 డిసెంబర్‌లో భారత టీ20 జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్..  సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ వేదికలపై తన సత్తా చాటాడు. ముఖ్యంగా ఇటీవల అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ సీజన్‌లో   తన అమోఘమైన బ్యాటింగ్ శైలితో ఏకంగా 498 పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో అతను చూపించిన స్థిరత్వం, దూకుడు,  మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించే నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ, రాబోయే ఐర్లాండ్,  ఇంగ్లండ్ పర్యటనలకు అతని సారథ్యంలోనే భారత యువ జట్టును బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. జూన్ 26,  జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్ తన  ప్టెన్సీ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నాడు.

మరోవైపు, భారత్‌కు విశ్వవిజేత కిరీటాన్ని మోపిన సూర్యకుమార్ యాదవ్   గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి పరుగులు సాధించడంలో విఫలమౌతుండటమే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడానికి కారణంగా భావిస్తున్నారు.  ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యాడు. ఆ నిరాశాజనక ఫామ్ ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ కొనసాగింది. ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ మొత్తం సీజన్‌లో కేవలం 270 పరుగులకే పరిమితమై తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ వరుస వైఫల్యాలు, పేలవమైన ఫామ్ కారణంగానే  కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతడికి ఉద్వాసన పలకాలని సెలక్టర్లు భావించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...