Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇంగ్లండ్ వన్డే సిరీస్కు భారత్ జట్టు ప్రకటన...కోహ్లీ, బుమ్రా రీఎంట్రీ!
posted on: Jun 21, 2026 3:19PM

త్వరలో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ టూర్ కోసం సెలక్టర్లు పలు కీలక మార్పులు చేశారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి అడుగుపెట్టారు.
ఈ కీలక పర్యటనకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్కు రోహిత్ శర్మ సైతం అందుబాటులో ఉన్నప్పటికీ, గిల్కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం గమనార్హం.
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 సీజన్లో కండరాల గాయానికి గురైన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం అతను కోలుకోవడంతో తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అయితే, మైదానంలోకి దిగే ముందు కోహ్లీ తన పూర్తి ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుందని బోర్డు నిబంధన విధించింది. మరోవైపు, పనిభారం (వర్క్లోడ్) మేనేజ్మెంట్లో భాగంగా గత సిరీస్కు విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ పిచ్లపై పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు.
సీనియర్ల పునరాగమనంతో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై సెలక్టర్లు వేటు వేశారు. ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో అద్భుత శతకంతో రాణించినప్పటికీ, కోహ్లీ రాకతో జైస్వాల్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అలాగే, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా ఈ పర్యటనకు దూరమయ్యాడు. అతను ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) లో పునరావాసం పొందుతున్నాడు.
ఇక దేశవాళీ క్రికెట్లో, గత సిరీస్లో మంచి ప్రతిభ కనబరిచిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ వన్డే జట్టులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూలై 14న ఎడ్జ్బాస్టన్ వేదికగా మొదటి వన్డే జరగనుంది. ఆ తర్వాత జూలై 16న సోఫియా గార్డెన్స్లో రెండో వన్డే, జూలై 19న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో మూడో వన్డే మ్యాచ్ నిర్వహించనున్నారు.
మరోవైపు, ఐర్లాండ్ టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ టూర్కు దూరమయ్యాడు. ఐపీఎల్లో ఎడమ కాలికి తగిలిన గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ వెల్లడించింది. దీనితో జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఐర్లాండ్ సిరీస్ కోసం సవరించిన టీ20 జట్టును కూడా బోర్డు ప్రకటించింది.
సీనియర్లు, యువ ఆటగాళ్ల కలయికతో ఎంపిక చేసిన ఈ వన్డే జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంగ్లండ్ పర్యటనకు భారత వన్డే జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గూరనూర్ బ్రార్.
ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు (సవరించిన):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.






