ఐపీఎల్ 2026 ఖతం.. 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా ఫుల్ షెడ్యూల్ చూశారా?

posted on: Jun 2, 2026 12:39PM

మే 31 నాటికి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 పండుగ ఘనంగా ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఐపీఎల్ హడావుడి ముగియడంతో ఇప్పుడు క్రికెట్ లవర్స్ అందరి దృష్టి భారత జాతీయ జట్టు మ్యాచ్‌లపై పడింది. ఇప్పటికే టి20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు తన తదుపరి మెగా లక్ష్యాలపై గురిపెట్టింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు విశ్రాంతి లేకుండా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి సిద్ధమవుతున్నారు. రాబోయే 18 నెలల కాలం భారత జట్టుకు అత్యంత కీలకమైన సవాల్‌గా మారనుంది. ఒకవైపు 2027 వన్డే వరల్డ్ కప్, మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ చేరడమే లక్ష్యాలుగా భారత జట్టు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది.

ఈ కొత్త సీజన్ ప్రయాణం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌తో మొదలుకానుంది. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు జరిగే ఈ చిన్న సిరీస్‌లో ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పోరు ముగిసిన వెంటనే జూలై నెలలో భారత్ కఠినమైన ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. జూలై 1 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా ఐదు టి20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. విదేశీ గడ్డపై ఇంగ్లాండ్ వేగవంతమైన పిచ్‌లను తట్టుకుని నిలబడటం భారత యువ ఆటగాళ్లకు ఒక పెద్ద పరీక్షగా మారనుంది.

ఆ తర్వాత ఆగస్టు నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టు అక్కడ రెండు టెస్టులు, రెండు టి20 మ్యాచ్‌లలో తలపడనుంది. సరిగ్గా నెల తిరిగేసరికి అంటే సెప్టెంబర్ లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టి20ల సిరీస్ షెడ్యూల్ అయింది. ఇదే సెప్టెంబర్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై మరోసారి మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్‌లో కూడా భారత క్రికెట్ జట్టు పాల్గొనబోతోంది. టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మరోసారి స్వర్ణ పతకం సాధించడమే భారత్ ప్రధాన లక్ష్యం. దీనికోసం బెంచ్ స్ట్రెంగ్త్ మరియు యువ ఆటగాళ్లకు సెలెక్టర్లు పెద్దపీట వేసే అవకాశం ఉంది.

ఇక అక్టోబర్ నెలలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుండగా, ఆ వెంటనే టీమిండియా కీవీస్ గడ్డపై న్యూజిలాండ్ సవాల్‌ను ఎదుర్కోవడానికి వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు మరియు ఐదు టి20ల భారీ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. 2027 ఆరంభంలో అంటే జనవరి-ఫిబ్రవరి నెలల్లో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే బోర్డర్గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుంది. ఎందుకంటే ఈ సిరీస్ ఫలితాలే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను శాసించనున్నాయి. జూన్ 2027లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఆసీస్ పై భారత్ గెలవడం తప్పనిసరి.

ఆ తర్వాత జూలై 2027లో బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను కాపాడుకోవాలని భారత్ చూస్తోంది. వీటన్నింటికీ మించి 2027 అక్టోబర్-నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ కోసం ఇప్పటి నుంచే టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కా ప్రణాళికలు, యువ బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తోంది. రాబోయే 18 నెలల నాన్‌స్టాప్ క్రికెట్ షెడ్యూల్ భారత జట్టులోని సీనియర్ల భవితవ్యాన్ని, యువకుల సత్తాను తేల్చనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...