జగన్ ఆస్తులను ప్రభుత్వ పరం చేయాలి! 

posted on: Jun 24, 2021 1:44PM

ఆర్థిక నేరగాళ్లపై కేంద్ర సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. బ్యాంకులను మోసం చేసి విదేశాల‌కు పారిపోయిన‌ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఈడీ అటాచ్ చేసిన  మొత్తం రూ.9,371 కోట్ల విలువైన ఆస్తులను రుణాలు ఇచ్చిన బ్యాంకులకు బదిలీ చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ఆస్తుల బదలాయింపుతో ఇప్పుడు ఏపీలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోగన్ రెడ్డి ఆస్తులను ప్రభుత్వ  పరం చేయాలనే డిమాండ్ వస్తోంది.

జగన్ అక్రమాస్తులను గుర్తించి ప్రభుత్వ ఖ‌జానాలో  జమ చేయాలని టీడీపీ సీనియర్ నేత  యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.మాల్యా, నీరప్ మోదీ, చోక్సీ ఆస్తులను కూడా బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వపరం చేశారని చెప్పారు. బ్యాంకులను మోసం చేసిన సొమ్మును తిరిగి బ్యాంకుల పరం చేసినట్లే, ప్రజలను మోసం చేసిన సొమ్మును ప్రజల పరం చేయాలన్నారు. సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొన్న జగన్ రూ.43 వేల కోట్ల అక్ర‌మార్జ‌న‌ను ప్రజాపరం చేయాలని య‌న‌మ‌ల అన్నారు. జగన్ పాల్ప‌డ్డ‌ ఆర్థిక నేరాలకు ఆయ‌న‌ అఫిడవిటే అద్దం పట్టిందని  47 పేజీల అఫిడవిట్‌లో 18 పేజీలు ఆర్థిక నేరాల చిట్టానే ఉందని తెలిపారు.

డొల్ల కంపెనీలు పెట్టి నిధుల సమీకరణతో పాటు న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ నేరాల్లో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలతో జగన్ పోటీ పడుతున్నారని య‌న‌మ‌ల అన్నారు. భార‌త్‌లోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం జగన్ క్విడ్ ప్రొకో అవినీతి అని య‌న‌మ‌ల ఆరోపించారు. అంతర్జాతీయ వ‌ర్సిటీల్లో పాఠ్యాంశాలుగా జగన్ ఆర్థిక నేరాల చిట్టాలు ఉన్నాయని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆర్థిక నేరం హత్య కంటే ప్రమాదకరమని గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించిందన్న విషయాన్ని యనమల గుర్తు చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాగే జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...