ఒక గూటి శత్రువులు ఇంకో గూటికి.. మనగలరా..?

posted on: Jan 25, 2016 4:11PM

తెలంగాణ అధికార పార్టీలోకి వలసల పర్వం ఎప్పటినుండో సాగుతూనే ఉంది. ఉన్న పార్టీపై అసంతృప్తి చెందో.. పార్టీలో తమకు ప్రాధాన్యత లేదనో.. తమకు నేతల నుండి సపోర్టు రావడం లేదనో కారణం ఏదైనా కానీ.. తమ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు  నాయకులు. ఇప్పటికే చాలా మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు ఎక్కువగా టీఆర్ఎస్ లోకి చేరినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒక పార్టీలోనే విభిన్న వాదనలు ఉండి.. ఒకరంటే ఒకరికి పడని.. ఒకరికి పదవి దక్కకుండా మరోకరు అడ్డుపడి.. ఇలా శత్రవులుగా ఉన్నవారందరూ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా కృష్ణయాదవ్ టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరిన తలసాని యాదవ్ కి.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్న కృష్ణయాదవ్ కి గతం నుండే అభిప్రాయభేదాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినా కూడా.. ఎవరో ఒకరే మంత్రిగా ఉండే అవకాశం ఉండేది. తరువాత 2003 లో కృష్ణయాదవ్ స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని జైలుకి వెళ్ల్రారు. అనంతరం  కృష్ణయాదవ్ జైలు నుంచి వచ్చిన తరువాత టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకునేందుకే తలసాని ప్రయత్నించారు. కానీ తలసాని ఎత్తులను అడ్డుకొని చివరికి ఆయ‌న టీడీపీలో చేరారు. కానీ తనకు అనుకున్న ప్రాధాన్యత కల్పించలేదు. ఆ తరువాత తలసాని యాదవ్ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. టీడీపీ నుండి గెలుపొందిన తలసాని యాదవ్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి చేరి ఆపార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా కోర్టులో ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఎప్పుడైతే టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తలసాని టీఆర్ఎస్ లో చేరారో అప్పటి వరకూ ప్రాధాన్యత లేని కృష్ణయాదవ్ కు తలసాని పదవి లభించింది. అయితే ఇక్కడ కూడా రాజకీయాలు చేసి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయాదవ్ ఆ పదవికి పనికిరాడని చెప్పి.. మాగంటి గోపీనాథ్‌కు ఆపదవిని కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో కంటోన్మెంటు ఎమ్మెల్యే జి. సాయన్న ప్రధాన పాత్ర పోషించారు. అయితే సాయన్న కూడా ఎప్పుడో టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్ లోకి చేరిన విజయ రామారావుకి కూడా.. ఈ నేతలతో విభేధాలు ఉండేవి.

మరి గత పార్టీలో పరస్పరం విబేధాలు ఉన్న నేతలందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అలాంటి నేతలు మరి ఇప్పుడు ఆ పార్టీలో కలిసి మనగలరా..? లేక గతంలో లాగానే అంటీ ముట్టనట్టు ఉంటారా అని అనుకుంటున్నారు. అయితే మన ఇంట్లో ఏం చేసినా చెల్లుతుంది కానీ.. పక్కింట్లోకి వెళ్లి ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా.. అలానే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తమ ఆటలు సాగించిన పార్టీ నేతలు.. పక్క పార్టీ అయినా టీఆర్ఎస్ లోకి వెళ్లి గతంలో లాగానే చేస్తానంటే కుదరదు కదా.. అందునా టీఆర్ఎస్ అధినేతే కేసీఆర్ ముందు కుప్పిగంతులు అంటే కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఎంతవరకూ కలిసి ఉంటారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...