మాటని మార్చడంలో తెదెపా ఎమ్మెల్యే రికార్డు...

తెదెపా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి- తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేయడం గురించి ఎన్టీఆర్‌ భవన్‌లో ఆవేశంగా ఉపన్యసించారు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో కూర్చుని పార్టీ భవిష్యత్తు గురించి చర్చించారు. ఇప్పుడే వస్తాను మాస్టారూ అంటూ అలా బయటకి వెళ్లి ఇలా గులాబీ కండువాతో టీవీలలో కనిపించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు పక్కనే కూర్చున్న రాజేందర్‌, నేరుగా తాజ్ కృష్ణాకి వెళ్లి కేటీఆర్‌ని కలిశారు. నారాయణపేటకి తెదెపా ఎమ్మెల్యేగా ఉన్న రాజేందర్‌రెడ్డి ఫిరాయింపు రాజకీయాలకి కొత్త అర్థాన్ని ఇచ్చారు. విభేదాలు ఉంటేనో, తిట్టుకునో కొట్టుకునో విడిపోనవసరం లేదనీ... ఆటోలో మీటర్‌ వేసినంత తేలికగా పార్టీలు మారిపోవచ్చుననీ రుజువు చేశారు. కర్ణాటకలో వైద్యకళాశాల మీద రెండుచేతులా సంపాదించుకున్న రాజేందర్‌రెడ్డి రాజకీయాలలోకి చేరి ఇక్కడా విజయం సాధించారు. అయితే గత ఏడాది ఆయన ఇంటి మీద ఆదాయపు పన్ను అధికారులు దాడి చేయడంతో 18 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. అధికార పక్షంలో ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావనుకున్నారో ఏమో ఇప్పడు హఠాత్తుగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిల్చొని క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచించిన ఆయన, తన మాటలను తిరగరాస్తూ రూటు మార్చేశారు.