మంత్రుల చెలగాటం… విశాఖ టీడీపీ ప్రాణ సంకటం!

 

మన దేశంలో అధికార పార్టీపై కుంభకోణం ఆరోపణలు రావటం సహజమైపోయింది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వం మొదలు చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాల దాకా అంతటా కుంభకోణాల వార్తలే! గత యూపీఏ సర్కార్ తో పోలిస్తే ఇప్పటి మోదీ గవర్నమెంట్ నూటికి నూరు శాతం నిజాయితీగా పని చేస్తోందనే చెప్పాలి. కాని, మన రెండు తెలుగు రాష్ట్రాల కీర్తి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మసకబారుతోంది. ప్రధానంగా తెలంగాణలో మియాపుర్ భూకుంభకోణం, ఆంధ్రాలో విశాఖ భూకుంభకోణం ఒకేసారి బయటపడి జనంలో ఎంతో కొంత అనుమానం సృష్టించేశాయి…

 

అధికారంలో వున్న పార్టీపై ప్రతిపక్షాలు కుంభకోణం ఆరోపణలు చేయటం పెద్ద ఇబ్బందికర విషమేం కాదు. కాని, ఏపీలో టీడీపీకి… అంతకంటే డ్యామేజింగ్ ఇంటర్నల్ ఫైట్ తో ఇబ్బంది కలుగుతోంది. అదే ఇప్పుడు టీడీపీ అభిమానుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఇంటి పోరు ప్రతిపక్షానికి కూడా మంచి ఆయుధంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి…

 

విశాఖలో టీడీపీకి బలమైన నేతగా పేరుంది మంత్రి ఆయ్యన్న పాత్రుడికి. అలాగే, 2014 విజయం తరువాత విశాఖ టీడీపీలో ఎంతో కీలకమయ్యారు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు. కాని, వీరిద్దరి మధ్యా విభేదాలు పబ్లిక్ సీక్రెట్టే! మహానాడు లాంటి వేడుకల్లో కలిసే కనిపించినా, చంద్రబాబు ముందు బుద్దిగానే వున్నా … అదను వస్తే అయ్యన్న, గంటా ఒకరినొకరు కార్నర్ చేసుకునే అవకాశాలు అస్సలు వదలటం లేదు. మరీ ముఖ్యంగా, అయ్యన్న పాత్రుడు… గంటా శ్రీనివాసరావును విశాఖ స్థానికుడు కాదన్నట్టుగా భావిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయన స్థానికులు కాని వారొచ్చి విశాఖలో జనం కష్టం పడి కొనుక్కున్న భూముల్ని మింగేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై సీరియస్ గానే స్పందించిన గంటా శ్రీనివాసరావు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసి విచారణ జరిపించి నిజం తేల్చాలని డిమాండ్ చేశారు. అయ్యాన్న పాత్రుడు తన మీద కోపాన్ని పార్టీకి నష్టంగా మార్చేస్తున్నారని వాపోయారు!

 

మొదట్నుంచీ ఏదో ఒక అంశంపై అయ్యన్న, గంటా ఇలా మాటల యుద్ధం నడుపుతూనే వున్నారు. కానీ, భూముల కుంభకోణం లాంటి తీవ్రమైన అంశంలో కూడా తమలో తాము గొడవపడి ప్రతిపక్షానికి మంచి అవకాశం ఇవ్వటం టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేని పరిణామం. అదీ అయ్యన్న పాత్రుడు, గంటాశ్రీనివాసరావు మంత్రుల స్థాయిలో వుంటూ ఇలా చేయటం పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తుంది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. కాని, అంతకంటే ముందు టీడీపీ నేతలు ఇద్దరూ వ్యక్తిగత స్పర్థల్ని పక్కన పెట్టి వైసీపీని ఎదుర్కోవాలి. లేదంటే అవినీతి ఆరోపణల్ని జనం సీరియస్ గా తీసుకుని వచ్చే ఎన్నికల్లో చేదు ఫలితాల్ని రుచి చూపించే ప్రమాదం వుంది!