జంప్ జిలానీల పరిస్థితి రెంటికీ చెడిన రేవడి కాబోతోందా?
posted on: Jan 24, 2015 11:42AM
కొన్ని రోజుల క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) కి ఎన్నికలు నిర్వహించాలనుకొంటున్నట్లు తెలిపి అందుకోసం తగిన వ్యూహాలు సిద్దం చేసుకోమని ఆదేశించారు. హైదరాబాద్ జంట నగరాల నుండి త్వరలో 20మంది కార్పొరేటర్లు తెరాసలో జేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయన అన్న మాటలను నిజం చేస్తూ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ లో తెదేపా ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డితో బాటు మరో ఐదుగురు తెదేపా కార్పొరేటర్లు తెరాసలో జేరారు. కనుక నేడు కాకపోతే రేపయినా బహుశః మిగిలిన వారు కూడా జంప్ అయిపోయే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ఇప్పటికే తెదేపాకు చెందిన సీనియర్ నేతలు తీగల, శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెరాస కండువాలు కప్పుకొన్నారు.
వారందరూ కలిసి జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాస పార్టీకి అఖండ విజయం సాధించిపెడతారనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వారినందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంగతి వారికీ తెలుసు. అందుకోసమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి కూడా దక్కిందని అందరికీ తెలుసు. వారందరికీ హైదరాబాద్ పై మంచి పట్టున్న మాట వాస్తవం. కానీ తెలంగాణా నేతలయిన వారందరికీ ఇంతకాలం జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలు ఎందుకు ఓట్లువేసి గెలిపిస్తున్నారు? అనే ప్రశ్న వేసుకొంటే వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారయినందునేనని స్పష్టం అవుతుంది. కానీ వారిప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి ఆంధ్రప్రజలను, ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ, వ్యతిరేకించే తెరాస పార్టీలో చేరిన తరువాత కూడా జంటనగరాలలో ఆంద్రప్రజలు వారికే ఓటువేస్తారా? అని ప్రశ్నించుకొంటే బహుశః వేయకపోవచ్చనే సమాధానం వస్తుంది. వారందరూ తెరాసకు తమ సాంప్రదాయమయిన ఆంద్ర ఓటు బ్యాంకును ఖచ్చితంగా బదిలీ చేస్తారనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వారినందరినీ నెత్తిన పెట్టుకొంటున్నారు. కానీ వారివల్ల అది సాధ్యం కాదని తేలితే, అప్పుడూ వారిని కేసీఆర్ గౌరవిస్తారా? ఇవ్వకపోతే వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించుకొంటే ‘రెంటికీ చెడిన రేవడి’అని చెప్పుకోవలసి వస్తుందేమో? అటు ఎన్నికలలో గెలిచే అవకాశం కోల్పోయి, ఇటు తెరాసలో నిరాదరణకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
వారు తెరాసకు తమ ఆంధ్రా ఓటు బ్యాంకును బదలాయించలేరని గ్రహించిన మరుక్షణం కేసీఆర్ ప్రత్యామ్నాయంగా కనబడుతున్న వైకాపాను దగ్గిరకు తీసుకోవచ్చును. తెలంగాణాలో మళ్ళీ దుఖాణం తెరవాలని తహతహలాడుతున్న వైకాపా కూడా ఈ అవకాశాన్ని జారవిడుచుకోకపోవచ్చును.
ఇదే జరిగితే తీవ్రంగా నష్టపోయేది తెదేపా నుండి తెరాసలోకి జంప్ చేస్తున్న నేతలే. ఎందుకంటే వారు ఖాళీ చేసిన స్థానాలలోకి తెదేపా, బీజేపీలు తమ అభ్యర్ధులను నిలబెడతాయి కనుక ఇంతవరకు సాంప్రదాయంగా వారికి పడుతున్న ఆంధ్రా ఓట్లన్నీ కూడా తెదేపా, బీజేపీ లేదా వైకాపా అభ్యర్ధులకే పడవచ్చును. అందువలన మిగిలినవారయినా ఆచి తూచి అడుగువేయడం మంచిదేమో?



.gif)
.jpg)

.webp)



