పదవే పరమావధి... ఏ గడ్డి తినడానికైనా రెడీ!

posted on: Sep 20, 2015 12:44PM

అప్పటివరకూ అధికార పార్టీపై ఒంటికాలిపై లేస్తారు, తీవ్ర విమర్శలు చేస్తారు, ఆ తర్వాతి రోజే, ఏ పార్టీనైతే తిట్టారో అదే పార్టీలో చేరిపోతారు. ఇదీ ఇప్పటి రాజకీయ నేతల నైతిక విలువలు, ఒక విధానం ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు, పదవే పరమావధిగా ఏ గడ్డి తినడానికైనా రెడీగా ఉంటారు. విలువలు కలిగిన నేతలు ఈరోజుల్లో కరువై పోయారు, భూతద్దంతో వెదికినా నికార్సైన నాయకులు దొరకని రోజులివి.

ఇలా పార్టీల మారిన నేతలు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు, ఒక్కరేమిటి...దాదాపు చాలామంది ఆ బాపతే, అయితే సిద్ధాంతాలను విభేదించి పార్టీలు మారేవాళ్లు తక్కువగా ఉంటారు, పదవి దక్కలేదనో, తన మాట నెగ్గలేదనో పార్టీలు మారే వారే ఎక్కువ. ఎక్కడో అక్కడక్కడా చుక్కుల్లో చంద్రుల్లా కొందరు కనిపించినా, ప్రజలు మాత్రం వాళ్లని ఆదరించరు, ఏ టైమ్ కి ఆ గడ్డి తినే వాళ్లనే అభిమానిస్తారు, గెలిస్తారు. పైగా ఇలాంటి వాళ్లనే పదవులు కూడా వరిస్తుంటాయ్. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, ఎందరికో బీ-ఫారాలు అందజేసిన డీఎస్ లాంటి నేతలు కూడా పార్టీలు మారిపోయారంటే, పొలిటికల్ లీడర్స్ కి పదవులు ఎంతో ముఖ్యమో చెప్పొచ్చు

ఇప్పుడు అదే బాటలో మరో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు పయనిస్తున్నట్లు తెలుస్తోంది, నిన్నమొన్నటివరకూ కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా తీవ్ర విమర్శలు చేసిన ఆ గ్రేటర్ లీడర్... అదే పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. రెండు మూడ్రోజుల్లో టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే ఈ నాయకుడు, గతంలో టికెట్ ఇవ్వలేదని, ప్రత్యర్ధి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి,  రెండు మూడు నెలలకే మళ్లీ అధికార పార్టీలోకి దూకేసిన లీడర్. ఆ తర్వాత రెండు పర్యాయములు మంత్రి పదవి కూడా వెలగబెట్టిన ఈయన... మరోసారి అధికార పార్టీలోకి జంప్ చేయబోతున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...