మోదీతో బ్రిటన్‌ ప్రధాని చర్చలు... టాటా స్టీల్‌ గురించేనా!

posted on: Mar 31, 2016 5:32PM

 

అమెరికాలో జరగనున్న అణుభద్రత సదస్సులో పాల్గొనేందుకు ఇటు భారత ప్రధాని మోదీ, అటు బ్రిటన్‌ ప్రధాన కెమెరూన్ వాషింగ్టన్‌కు చేరుకున్నారు. పనిలో పనిగా ఈ సమావేశంలో కెమెరూన్‌, బ్రిటన్‌లోని టాటాస్టీల్ సంక్షోభం గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇంగ్లండులోని సౌత్‌వేల్స్ ప్రాంతంలో టాటా యాజమాన్యానికి భారీ స్టీల్‌ కర్మాగారం ఉంది. అయితే రోజురోజుకీ ఈ కర్మాగారం నుంచి లాభాలు రాకపోగా, కోట్లకొద్దీ నష్టాలు వాటిల్లడం మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులు, చైనా నుంచి ఐరోపాకు కారుచౌకగా స్టీలు ఎగుమతి కావడం తదితర అంశాల వల్ల, ఆ కర్మాగారం సంక్షోభంలో పడిపోయింది.

 

దాంతో ఈ కర్మాగారాన్ని మూసివేయాలని టాటా యాజమాన్యం నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని అంచనా. అందుకే మూసివేత గురించి వదంతులు వినిపించగానే బ్రిటన్ ప్రధాని కెమెరూన్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడెక్కడి అధికారులో ఆదరాబాదరాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు లండన్ చేరుకున్నారు. నయానో భయానో ఈ కర్మాగారం మూతపడకుండా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికేదాకా టాటా యాజమాన్యం కాస్త ఓపికపట్టేలా చూడాలని కొందరు సూచించారట. ఇప్పటికే కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు టాటాలతో సంప్రదింపులు జరిపేందుకు ఇండియాకు చేరుకున్నారు. మరో పక్క, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మోదీ కూడా చొరవ తీసుకోవాలంటూ, బ్రిటన్ ప్రధాని కెమెరూన్‌ కూడా అభ్యర్థించనున్నారని తెలుస్తోంది. ఓడలు బళ్లుగా మారడం అంటే ఇదేనేమో!

google-ad-img
    Related Sigment News
    • Loading...