ఒక వైపు టారిఫ్‌లు.. మరోవైపు తాయిలాలు ట్రాంప్ సుంకాల రాజకీయం

టారిఫ్‌లతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సొంత దేశీయులను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు.  ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతుండగా, అక్కడి అధ్యక్షుడికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కూడా అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోంది, ఇదంతా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అయితే.. సుంకాల వల్ల భారీ ఆదాయం సమకూరుతోందని, డివిడెండ్‌ కింద ఒక్కో అమెరికన్‌కు కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశం. ద్రవ్యోల్బణం దాదాపు లేదు. రికార్డు స్థాయిలో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. లక్షల డాలర్లు వస్తున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం. డివిడెండ్‌ కింద ఒక్కో వ్యక్తికి  కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపేసేందుకు, లైసెన్స్‌ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఆమోదం ఉంది. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశంపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా..? ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వేయకూడదు..? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టుకు ఇది తెలియదా? అసలేం జరుగుతోందని ట్రంప్‌ మండిపడ్డారు.

ట్రంప్‌ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఇటీవల విచారించింది. ఈ సందర్భంగా దిగుమతి సుంకాలు మార్చడం, కొత్తవి విధించేందుకు అత్యవసర చట్టం ద్వారా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu