Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇండియాకు వరం.. టారిఫ్ రీఫండ్
posted on: Apr 22, 2026 11:35AM

అమెరికా ప్రభుత్వం గతంలో విధించిన కఠినమైన వాణిజ్య టారిఫ్ లను అక్కడి న్యాయస్థానం రద్దు చేయడంతో.. భారత ఎగుమతిదారులకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశంఉంది. ట్రంప్ అమల్లోకి వచ్చిన పలు సుంకాలపై కోర్టు స్టే విధించడమే కాకుండా.. వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20 నుంచి రీఫండ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దీనివల్ల భారతదేశానికి సుమారు 12 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1 లక్ష కోట్లు లబ్ధి చేకూరుతుందన్నది అంచనా.
ఈ రీఫండ్ ప్రక్రియలో ప్రధానంగా మూడు రంగాలు అత్యధికంగా లాభపడనున్నాయి. అమెరికా మార్కెట్కు పెద్ద ఎత్తున వస్తువులను సరఫరా చేసే భారతీయ వస్త్ర పరిశ్రమకు సుమారు 4 బిలియన్ డాలర్లు వాపసు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు మరో 4 బిలియన్ డాలర్లు, రసాయన ఉత్పత్తుల రంగానికి 2 బిలియన్ డాలర్ల మేర రీఫండ్లు అందవచ్చనని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇతర చిన్న తరహా ఎగుమతి రంగాలు కూడా ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య అజెండాలో భాగంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అనేక దేశాలపై అదనపు సుంకాలను విధించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేలాది కంపెనీలు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఫిబ్రవరిలో హైకోర్టు ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చడంతో.. సుమారు 127 బిలియన్ డాలర్ల మొత్తం రీఫండ్కు అర్హత పొందింది. ఈ చారిత్రాత్మక తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
రీఫండ్ ప్రక్రియ ఇలా సాగుతుందియూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఇప్పటికే ఈ చెల్లింపుల కోసం ఆన్లైన్ ప్రాసెసింగ్ టూల్ను అందుబాటులోకి తెచ్చింది. మార్చి నాటి అంచనాల ప్రకారం.. దాదాపు 3.3 లక్షల మంది దిగుమతిదారులు ఈ రీఫండ్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇప్పటి వరకూ 56 వేల మందికి పైగా తమ క్లెయిమ్లను నమోదు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత, అధికారులు వాటిని పరిశీలించి 60 నుంచి 90 రోజుల వ్యవధిలో నగదును విడుదల చేస్తారు.
అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ రీఫండ్లు నేరుగా అమెరికాలోని దిగుమతిదారులకు అందుతాయి. భారతీయ ఎగుమతిదారులు ఈ నిధులను పొందాలంటే తమ అమెరికన్ భాగస్వాములతో చర్చలు జరపాల్సి ఉంటుంది. దీనికోసం నిపుణులు మూడు రకాల మార్గాలను సూచిస్తున్నారు.
వాటిలో మొదటిది.. రీఫండ్ రూపంలో వచ్చే మొత్తాన్ని ఇరు పక్షాలు పంచుకునేలా కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం. రెండోది.. గతంలో పన్నుల భారం వల్ల పెరిగిన ధరలను, ఇప్పుడు ఆ భారం తగ్గింది కనుక సవరించడం ద్వారా ప్రయోజనం పొందడం. ఇక మూడోది.. రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్గా మార్చుకుని.. రాబోయే ఆర్డర్లపై రాయితీలు పొందడం. భవిష్యత్ పరిణామాలు అమెరికా నుంచి రానున్న ఈ భారీ నగదు ప్రవాహం భారతీయ కార్మిక-కేంద్రీకృత రంగాలకు ఊపిరిపోస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ వంటి రంగాలలో లాభాల శాతం పెరగడమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో భారత వస్తువుల ప్రాధాన్యత పెరుగుతుంది. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలపై విధించిన ప్రత్యేక సుంకాలు ఇంకా కొనసాగుతుండటంతో.. ఆయా రంగాల ఎగుమతిదారులు మాత్రం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. రాబోయే కొద్ది నెలల్లో భారతీయ సంస్థలు ఎంత చాకచక్యంగా తమ అమెరికన్ భాగస్వాములతో వ్యవహరిస్తాయనే దానిపైనే ఈ టారిఫ్ రిఫండ్ లబ్ధి ఆధారపడి ఉంటుంది.
- సీతారాం కంఠంనేని


.webp)



