తమిళ రాజకీయాల్లో సంచలనం...ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

posted on: May 25, 2026 5:05PM

 

తమిళనాడులో అన్నాడీఎంకే కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్న వేళ.. సోమవారం ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరగతం కుమారవేల్‌, జయకుమార్‌, సత్యభామ తమ రాజీనామా లేఖలను సభాపతి జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. రాజీనామా అనంతరం వారు టీవీకే మంత్రి ఆదవ్ అర్జున్‌ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీవీ షణ్ముగం నేతృత్వంలో 20 మందికి పైగా అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 

ఇప్పుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా ఆ వర్గంలోనే ఉన్నారు.మదురాంతకం నియోజకవర్గం నుంచి గెలిచిన మరగతం కుమరవేల్‌, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్‌, ధారాపురం ఎమ్మెల్యే సత్యభామ రాజీనామా చేయడం AIADMKలో అంతర్గత సంక్షోభాన్ని మరింత బహిర్గతం చేసింది. దీంతో అక్కడ త్వరలో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. వరుసగా రెండోసారి అధికారానికి దూరం కావడంతో పార్టీలో విభేదాలు మరింత పెరిగాయి. వారు త్వరలోనే సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీలో చేరే అవకాశమున్నట్టు తమిళ రాజకీయాల్లో చర్చ జోరందుకుంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...