Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు, బెంగాల్ ఎన్నికలకు సర్వం సిద్దం
posted on: Apr 22, 2026 9:30PM

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ (మొదటి దశ)లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ ఊపందుకుంది.
ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్ను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెండు దశల రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు, ఆయా నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్ల నుండి యంత్రాలను పోలింగ్ కేంద్రాలకు పంపడం ప్రారంభించారు.
ఈవీఎంల రవాణాను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘా, పారామిలిటరీ దళాల రక్షణ నడుమ ఈ యంత్రాలను వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తూ, ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పోలింగ్ కేంద్రాలకు కేవలం ఈవీఎంలు మాత్రమే కాకుండా, ఎన్నికలకు అవసరమైన 60కి పైగా రకాల సామగ్రిని కూడా తరలిస్తున్నారు. ఇందులో భాగంగా స్టేషనరీ, ఓటర్ల జాబితాలు, సిరా, ఇతర నిత్యావసరాలను పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని రిటర్నింగ్ అధికారులు ఈ ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల విధుల కోసం నియమితులైన సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు బయలుదేరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం మౌలిక వసతులు, దివ్యాంగులకు ర్యాంప్లు, తాగునీరు, నీడ కోసం షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.
ఈసారి ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలు కొనసాగుతున్నాయి.
గడువులోగా పోలింగ్ సిబ్బంది తమ కేంద్రాలకు చేరుకుని, యంత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది.


.webp)


