Latest News
తమిళనాడులో గెలిచే పార్టీ ఏదో తేల్చేసిన కేకే సర్వే
posted on: Mar 12, 2026 3:21PM

త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై హైదరాబాద్కు చెందిన పారావీల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంచలన సర్వే నివేదిక విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తమిళనాడులో మళ్లీ ఎం. కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా శాంపిల్స్ సేకరించి శాస్త్రీయ విధానంతో అధ్యయనం నిర్వహించినట్లు సంస్థ వెల్లడించింది.
చెన్నైలో నిర్వహించిన సమావేశంలో సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి ఈ సర్వే వివరాలను వెల్లడించారు.సర్వే ప్రకారం డీఎంకేకు 41.5 శాతం ఓటు షేర్ లభించే అవకాశం ఉందని, (అన్నాడీఎంకే)కు 36.2 శాతం మద్దతు లభించవచ్చని తెలిపారు. ఇక టీవీకేకు 13.6 శాతం, నామ్ తమిళర్ కట్చికి 7.9 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని సర్వేలో తేలిందన్నారు. ముఖ్యంగా చెన్నైలో టీవీకేకు గణనీయమైన స్థాయిలో స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
కోవై, డెల్టా జిల్లాలు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ తమిళనాడు ప్రాంతాల్లో ఓటర్ల సెంటిమెంట్ను విశ్లేషిస్తూ పాలనపై ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ వ్యతిరేక ధోరణులపై వివరంగా అధ్యయనం చేశామని కొండేటి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తమ సంస్థ “కేకే పారావీల్” అనే వెబ్సైట్ను ప్రారంభించి ఎగ్జిట్ పోల్స్ 2026 పేరుతో పారదర్శకంగా సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.తమ సంస్థకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేసిన ఆయన, గతంలో జరిగిన 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫలితాలను కూడా తమ సంస్థ ముందుగానే అంచనా వేసిందని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి కూటమి అఖండ విజయం సాధిస్తుందని తమ సర్వే ముందుగానే పేర్కొన్నట్లు కిరణ్ కొండేటి వివరించారు.



.webp)


