Latest News
అభిషేక్ను చూసి అసూయపడేవాళ్లం...సంజూ షాకింగ్ కామెంట్స్
posted on: Mar 16, 2026 3:16PM

టీ20 వరల్డ్కప్ 2026లో అభిషేక్ శర్మ పేరు క్రికెట్ ప్రపంచంలో బాగా మార్మోగింది. దూకుడైన బ్యాటింగ్తో గుర్తింపు పొందిన అభిషేక్ కొంతకాలం ఫామ్ కోల్పోయినట్లు కనిపించడంతో అభిమానుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఫైనల్ మ్యాచ్లో అర్ధ సెంచరీతో రాణించి తన ప్రతిభను మరోసారి చాటాడు.
తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిషేక్కు పెరుగుతున్న పాపులారిటీ చూసి జట్టులోని ఇతర ఆటగాళ్లకు కొంచెం అసూయ కలిగేదని సంజూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 వరల్డ్కప్కు ముందు భారత జట్టు ఎక్కడ పర్యటించినా ఫ్యాన్స్ ఎక్కువగా అభిషేక్ను చూడటానికే క్యూ కట్టేవారని గుర్తు చేశాడు.
స్టేడియాల్లో కూడా అభిమానులు “అభిషేక్.. అభిషేక్” అంటూ నినాదాలు చేస్తుంటే, మిగతా ఆటగాళ్లు కనిపించడంలేదేమో అన్న భావన వచ్చేదని సంజూ నవ్వుతూ చెప్పాడు. “అసలు స్టేడియంలో ఉన్న జనాలకు మేము కనిపిస్తున్నామా లేదా అన్న డౌట్ వచ్చేది. మేము ఉన్నా కూడా కేవలం అభిషేక్ను మాత్రమే చూస్తున్నారా అని మేమంతా సరదాగా మాట్లాడుకునేవాళ్లం” అని వెల్లడించాడు.
ఇంకా సరదాగా “భాయ్ నువ్వు త్వరగా మ్యారేజ్ చేసుకో… అప్పుడైనా మాకు కొంచెం లైమ్లైట్ దక్కుతుంది” అని సంజూ చమత్కరించాడు. అదే సమయంలో అభిషేక్ కృషి, పట్టుదలను ప్రశంసిస్తూ ప్రస్తుతం జట్టులో స్టార్ ప్లేయర్గా ఎదిగాడని కొనియాడాడు.
అదే వేదికపై అభిషేక్ శర్మ కూడా తన భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడాడు. భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడి రాణించడమే తన లక్ష్యమని తెలిపాడు. తన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించనని, గురువు యువరాజ్ సింగ్ నేర్పిన పద్ధతులను మాత్రమే అనుసరిస్తానని చెప్పాడు. వన్డే జట్టులో చోటు దక్కితే అది తన కల నెరవేరినట్లే అని అభిషేక్ వెల్లడించాడు.


.webp)



