కాలేయం దెబ్బ తింటే కనిపించే లక్షణాలు ఇవే..!
posted on Apr 19, 2025 9:30AM
.webp)
కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది కలుషితమైతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. జీవన శైలి సరిగా లేకపోవడం, ఆహారం తీసుకునే విధానం సరిగా లేకపోవడం. ఆరోగ్యకర ఆహారం తీసుకోకపోవడం వంటివి లివర్ పాడవడానికి కారణం అవుతాయి. ఎక్కువ కొవ్వు పదార్థాలు, బేకరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాలేయం దెబ్బ తింటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే..
కాలేయం దెబ్బతిన్నప్పుడు, కాలేయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరంలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం. అంటే తరచుగా కామెర్ల వ్యాధి రావడం. తగ్గిపోయిన కొన్ని రోజులకే కామెర్ల వ్యాధి మళ్లీ వస్తుంటే కాలేయం పనితీరు మందగించిందని అర్థం. దీని వల్ల కాలేయం దెబ్బ తిన్నట్టు అర్థం చేసుకోవచ్చు.
కాలేయంలో ఏదైనా సమస్య ఉన్నా, లేదా కాలేయం దెబ్బ తిన్నా అలాంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులతో పోలిస్తే బాగా అలసటగా కనిపిస్తుంటారు. వీరు ఎప్పుడూ అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటారు.
కడుపులో వాపు లేదా నొప్పి ఉన్నా కాలేయం దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కడుపులో కుడి వైపు ఎగువ భాగంలో నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే ఆకలి అనిపించదు. లేదా అసలు ఆకలి వేయదు. ఏమీ తినాలని కూడా అనిపించదు. అంతేకాదు.. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. తరచుగా వికారం, వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
కాలేయ సమస్యలు ఉన్నవారికి మల విసర్జన ద్వారా కూడా సంకేతం వస్తుంది. మల విసర్జనకు వెళ్లినప్పుడు మలం రంగులో మార్పులు ఉంటాయి. మలం బురద నలుపు రంగులో ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్టు అర్థం చేసుకోవచ్చు.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...