కేసీఆర్ని విమర్శించడం చాలా అన్యాయం

posted on: Jan 21, 2015 3:15PM

 

తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ స్వైన్ ఫ్లూ పేరు చెబితేనే ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే 20 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి మరణించారు. ఈ వ్యాధి భవిష్యత్తులో మరింత ప్రబలే ప్రమాదం వుందన్న భయాన్ని సాక్షాత్తూ సీఎం కేసీఆరే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‌నిర్లక్ష్యం కారణంగానే స్వైన్ ఫ్లూ ప్రబలిపోయిందని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణను స్వైన్ ఫ్లూలో నంబర్ వన్ చేశారని విమర్శిస్తున్నారు. నిజంగా ఇవి చాలా దారుణమైన విమర్శలు. కేసీఆర్ని ఏ విషయంలో విమర్శించినా పెద్ద బాధ కలగదుగానీ, స్వైన్ ఫ్లూ విషయంలో విమర్శిస్తే మాత్రం చాలా బాధ కలుగుతూ వుంటుంది. పాపం ఆయన బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణలోని అన్ని కార్పొరేషన్లలో పర్యటిస్తూ బిజీగా వున్నారు. పేద ప్రజలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు ఎలా కట్టించాలా అని ఆయన నిరంతరం ఆలోచిస్తూ మథనపడుతున్నారు. పేదల్ని ఎలా ఆదుకోవాలన్న ఆలోచనలోపడిపోయిన ఆయన స్వైన్ ఫ్లూ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అదేదో పెద్ద తప్పు అయినట్టు ప్రతిపక్షాలు విమర్శించడం దారుణం.

 

అయినా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రబలుతోందని సీఎం కేసీఆర్‌కి తెలియదని అనుకుంటున్నారా? ఆయనకి ఈ విషయం ఎప్పుడో తెలుసు. కానీ, ఏదో స్వైన్ ఫ్లూ వచ్చింది.. రెండు మూడు రోజులు వుండి పోతుందిలే అని లైట్ తీసుకున్నారు. ఏదో అనుకోకుండా 20 మందికి పైగా చనిపోయారు. అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే వుంటాయి. అసలు పొరపాట్లు చేయనివాళ్ళెవరు? అలాంటప్పుడు ఈ విషయం మీద రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగునా? అయినా అంతమంది చనిపోయాక కేసీఆర్ స్పందించారు కదా? వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు కదా? ప్రధానమంత్రితో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడి సాయం చేయమని అడిగారు కదా? అధికారులతో సమావేశాలు ఏర్పాటు కూడా చేశారు కదా.. ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు కదా... ఇంత చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే వాళ్ళని ఏమనాలి?

google-ad-img
    Related Sigment News
    • Loading...