Latest News

మరోసారి ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ

posted on: Mar 24, 2026 4:32PM

 

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మరోసారి ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.14.99పై రూ.2.59 పెంచి, మొత్తం ఫీజును రూ.17.58కు చేర్చింది. ఈ పెంపుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో జొమాటో కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్విగ్గీ కూడా అదే బాటలో నడుస్తూ ఫీజును పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

చమురు ధరల పెరుగుదల, ఇంధన కొరత వంటి కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కంపెనీలు కస్టమర్ల జేబులకు చిల్లులు పెడుతున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పెంచిన ప్లాట్‌ఫామ్ ఫీజు ద్వారా యాప్ నిర్వహణ, సాంకేతిక సేవలు, సంస్థ కార్యకలాపాలను కొనసాగించడానికి ఉపయోగపడుతుందని స్విగ్గీ వినియోగదారులకు తెలియజేసింది. ఈ వివరాలు ప్రస్తుతం చెక్అవుట్ సమయంలో యాప్‌లో కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, జొమాటో కూడా ఒక్కో ఆర్డర్‌పై రూ.2.40 వరకు ఛార్జీలు పెంచింది. దీంతో స్విగ్గీ, జొమాటో రెండూ దాదాపు సమాన స్థాయిలో ప్లాట్‌ఫామ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరి ధరల వ్యూహాన్ని మరొకరు అనుసరిస్తున్న ధోరణి కొనసాగుతోంది. ఫుడ్ డెలివరీ బిల్లులో ప్లాట్‌ఫామ్ ఫీజులు చిన్న భాగమే అయినప్పటికీ, ఇవి క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తరచుగా ఆర్డర్లు చేసే వినియోగదారులు కాలక్రమేణా ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. కాగా, ఈ ఛార్జీలు అవసరమని కంపెనీలు సమర్థించుకుంటున్నప్పటికీ, వినియోగదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...