Latest News

మెరుగైన ప్రజారోగ్యం కోసం.. స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్ మెంట్!

posted on: Mar 31, 2026 4:43PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ప్రతి నెలా 4వ శనివారం పాపులేషన్ మేనేజ్ మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా  హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కుప్పం, నారావారి పల్లెలలో నిర్వహించి అది సక్సెస్ కావడంతో  ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాంప్ కార్యాలయంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం (మార్చి 31) సమీక్ష నిర్వహించారు.  

జులై నాటికల్లా   సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.  వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలన్న లక్ష్యాన్ని అధికారులకు  నిర్దేశించారు.  ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూన్సిట్ అవసరం కానున్నాయని, రూ.162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.    ఇక వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గేలా సేవలు అందించాలనీ, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలనీ సీఎం చెప్పారు.  సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఏమేరకు మెరుగయ్యిందో పరిశీలించాలని సూచించారు.  

మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని అనే ఈ 5 పిల్లర్లతో త్వరలో  ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ  తీసుకురావాలని   సీఎం నిర్దేశించారు.  ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీని త్వరలో  అమలు చేయాలన్న అంశంపై కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు.  యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...