ఏపీ మద్యం కుంభకోణం.. కేసు తీవ్రత తేటతెల్లం చేసిన సుప్రీం వ్యాఖ్యలు!
posted on: Feb 10, 2026 1:42PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు ఎంత తీవ్రమైనదో, ఆ కేసులో ఎంత బలం ఉందో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ కేసులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్న ఏ1 రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య దేవస్థానం చేసిన వ్యాఖ్యలు ఈ కేసులోని సీరియస్ నెస్ ను కళ్లకు కట్టాయి. అసలు రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ ప్రారంభం కాగానే.. సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ లో తాము జోక్యం చేసుకోవడానికి ఏం లేదని కుండబద్దలు కొట్టింది. విచారణ జరపడానికే సుముఖత వ్యక్తం చేయలేదు.
రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి కొట్టిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కేసిరెడ్డిని సుప్రీంకోర్టు అభివర్ణించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అంది. పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఆస్కారం లేదని తేల్చి చెప్పడం ద్వారా.. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఎంత బలంగా ఉన్నాయో కోర్టు పరోక్షంగా వెల్లడించింది. ఆర్థిక నేరాలలో నిందితులకు ఊరటనివ్వడం సరైనది కాదని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. మద్యం కుంభకోణంలో రాజ్ కేసీరెడ్డి కేవలం ఒక ముసుగు మాత్రమేనని, దీని వెనుక అసలు కథానాయకుడు ఉన్నారన్నది తేల్చే దిశగా దర్యాప్తు జోరందుకోనుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యల తరువాత పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పారదర్శకతను పక్కనపెట్టి, డిజిటల్ చెల్లింపులను కాదని, కేవలం నగదు రూపంలోనే మద్యం విక్రయాలు జరిపించి వేల కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఈ వ్యవస్థ వెనుక పెద్దల హస్తం ఉందని మొదటి నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్ కేసీరెడ్డిని ప్రధాన సూత్రధారి గా పేర్కొనడంతో, ఇక దర్యాప్తు సంస్థలు ఈ కుంభకోణంలో చక్రం తిప్పిన బాస్ వైపు మళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. మద్యం సరఫరా , డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో జరిగిన భారీ అవకత వకలపై విచారణ సంస్థలు ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించాయి.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ దర్యాప్తుకు మరింత చట్టబద్ధమైన బలాన్ని చేకూర్చాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ వ్యవస్థపై మరింత లోతైన విచారణ ఆవశ్యకతను సుప్రీం కోర్టు తన వ్యాఖ్యల ద్వారా ఎత్తి చూపిందని భావిస్తున్నారు.
ఈ కేసులో రాజ్ కేసీరెడ్డి బెయిల్ నిరాకరణ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు దోషులు బయటకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, ఈ నిర్ణయం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇతర నిందితులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. కింగ్పిన్కే బెయిల్ దక్కని పరిస్థితుల్లో, మిగిలిన పాత్రధారులు కూడా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.






