ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసు.. పోలీసులపై సుప్రీంకోర్డు ఫైర్.. ఎందుకంటే?
posted on: Feb 20, 2026 1:54PM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం (ఫిబ్రవరి 20) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
తప్పుచేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోలీసులు.. నిందితుడితో ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు డీఫాల్ట్ బెయిల్ను పొడగించిన న్యాయస్థానం.. నవంబర్ 30లోగా ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. వేగంగా ట్రయల్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు ఉన్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలు ఇచ్చింది.







