Latest News

ఓబీసీ క్రీమీలేయర్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

posted on: Mar 13, 2026 7:23PM

 

సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో విజయం సాధించినప్పటికీ ఓబీసీ సంపన్న శ్రేణి (క్రీమీలేయర్‌) పరిధిలోకి వస్తారని పేర్కొంటూ ఉద్యోగ నియామకాలు నిరాకరించిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. ఓబీసీ క్రీమీలేయర్‌ను నిర్ణయించేటప్పుడు తల్లిదండ్రుల జీతాలు మాత్రమే కాకుండా వారి ఉద్యోగ హోదా, ఆ పోస్టు కేటగిరీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహ, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ల ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అభ్యర్థులను కేవలం ఆదాయం ఆధారంగా క్రీమీలేయర్‌గా గుర్తించడం చట్టబద్ధం కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసిన ధర్మాసనం, అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైతే అదనపు పోస్టులు సృష్టించాలని కూడా ఆదేశించింది. ధర్మాసనం తరఫున తీర్పును జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ రచించారు.

పీఎస్‌యూలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల విషయంలో ఆదాయ గణన విధానం భిన్నంగా ఉండాలని కోర్టు తెలిపింది. తల్లిదండ్రుల పదవులు, హోదాలు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఆదాయం ఆధారంగా సంపన్న శ్రేణిని నిర్ణయించడం వివక్షకు దారితీస్తుందని పేర్కొంది. వేతన ఆదాయం, వ్యవసాయ ఆదాయం, ఇతర వనరుల ఆదాయాన్ని కలిపి క్రీమీలేయర్‌ను నిర్ణయించడం కూడా సరికాదని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం 1993లో జారీ చేసిన ఆఫీస్‌ మెమోరాండాన్ని పట్టించుకోకుండా, 2004లో విడుదలైన వివరణ లేఖ ఆధారంగా అభ్యర్థుల అర్హతను నిర్ణయించడం తప్పని ధర్మాసనం అభిప్రాయపడింది. సామాజిక వెనుకబాటుతనాన్ని నిర్ణయించడంలో కులం ఒక సూచిక మాత్రమేనని, అది ఒక్కటే ప్రమాణం కాదని కూడా వ్యాఖ్యానించింది.

వివాదం ఎలా మొదలైంది?

సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన కొందరు అభ్యర్థులు తమకు ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ కేటగిరీలో రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. అయితే 2004 అక్టోబరులో కేంద్రం జారీ చేసిన వివరణ లేఖ ఆధారంగా తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు మించితే క్రీమీలేయర్‌గా పరిగణిస్తామని పేర్కొంటూ సిబ్బంది వ్యవహారాల శాఖ వారికి రిజర్వేషన్లు నిరాకరించింది. దీనిపై అభ్యర్థులు కేంద్ర పాలనా ట్రైబ్యునల్‌తో పాటు మద్రాస్‌, దిల్లీ, కేరళ హైకోర్టులను ఆశ్రయించారు. హైకోర్టులు అభ్యర్థుల వాదనలను సమర్థించాయి.

1993 ఆఫీస్‌ మెమోరాండం ఏమంటోంది?

1993లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్‌ మెమోరాండం ప్రకారం తల్లిదండ్రుల ఉద్యోగ హోదాల ఆధారంగా కొందరిని ఓబీసీ క్రీమీలేయర్‌గా పరిగణించవచ్చు. గ్రూప్‌-ఎ (క్లాస్‌-1), గ్రూప్‌-బి అధికారుల పిల్లలు లేదా 40 ఏళ్లకు ముందే గ్రూప్‌-ఎ ఉద్యోగిగా పదోన్నతి పొందిన వారి పిల్లలను క్రీమీలేయర్‌గా పరిగణించాలి.

పీఎస్‌యూలు, బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లోని గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి హోదాలకు సమానంగా ఉంటే వారి పిల్లలను క్రీమీలేయర్‌గా పరిగణించాలి.

హోదా ఆధారిత నిబంధన వర్తించని సందర్భాల్లో మాత్రమే జీతం, వ్యవసాయ రాబడి కాకుండా ఇతర వనరుల ద్వారా వచ్చే స్థూల వార్షిక ఆదాయం వరుసగా మూడు సంవత్సరాలు నిర్దిష్ట పరిమితిని మించితే క్రీమీలేయర్‌గా గుర్తించాలని పేర్కొంది.

2004 వివరణ లేఖ ఏమంటోంది?

2004లో కేంద్రం విడుదల చేసిన వివరణ లేఖ ప్రకారం, పీఎస్‌యూ, బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే తల్లిదండ్రుల హోదా ప్రభుత్వ ఉద్యోగాల గ్రూప్‌-ఎ లేదా గ్రూప్‌-బికి సమానమని నిర్ధారణ కాని పక్షంలో ఆదాయం ఆధారంగా క్రీమీలేయర్‌ను నిర్ణయించాలి. తల్లిదండ్రుల వేతన ఆదాయం, ఇతర వనరుల ఆదాయాన్ని విడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖ పేర్కొంది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...