Latest News
గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
posted on: Mar 12, 2026 4:22PM

గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 13 సంవత్సరాలుగా స్పృహ లేకుండా జీవచ్ఛవంలా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందుతున్న వైద్య సహాయాన్ని నిలిపివేయడానికి అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
13 సంవత్సరాల క్రితం భవనం పై నుంచి కిందపడటంతో హరీశ్ రాణా మెదడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా పూర్తిగా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం, ఇలాంటి పరిస్థితుల్లో చికిత్సను కొనసాగించడం రోగి ప్రయోజనాలకు మేలు చేస్తుందా లేదా అన్నదే కీలకమని వ్యాఖ్యానించింది.
చదువులో చురుకుగా ఉండే యువకుడు ఇలా జీవచ్ఛవంలా మారడం బాధాకరమని కోర్టు పేర్కొంది. 13 సంవత్సరాలుగా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, కోలుకునే అవకాశం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో చికిత్స కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని కోర్టు అభిప్రాయపడింది.
అదేవిధంగా పైపుల ద్వారా అందించే పోషకాహారం కూడా వైద్య చికిత్సలో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యుల బృందం రోగిని పరిశీలించి కోలుకునే అవకాశం లేదని నిర్ధారించిన పక్షంలో, లైఫ్ సపోర్ట్తో పాటు పోషకాహారాన్ని కూడా నిలిపివేయవచ్చని ఈ తీర్పుతో స్పష్టమైంది.


.webp)



