ట్రిపుల్ మర్డర్ కేసు.. క్షమాభిక్షకు సుప్రీం నో!

posted on: Jun 10, 2026 9:45AM

ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీకి క్షమాభిక్ష ప్రసాదించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వివరాల్లోకి వెడితే.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో 2015లో  ఏడిద ఆనందకుమార్ అను వ్యక్తి ఒకేసారి ముగ్గురిని దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో దోషిగా తేలిన ఏడిద ఆనందకుమార్ కు  రాజమండ్రి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఆ తర్వాత  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఈ కఠిన శిక్షను సమర్థించింది. అయితే.. తన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆనందకుమార్ ఈ ఏడాది మే 25న దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  తన పిటిషన్‌లో తాను తీవ్రమైన బైపోలార్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నానని, అందువల్ల మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో శిక్ష నుంచి ఉపశమనం,  క్షమాభిక్ష ప్రసాదించాలని కోరాడు. 

జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిపి ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది.   ఈ కేసు నేపథ్యం  ఏమిటంటే..  ఏడిద ఆనందకుమార్ గతంలోనూ తన సొంత సోదరుడితో కలిసి ఒక   హత్య కేసులో నిందితుడిగా ఉండి జీవిత ఖైదు   అనుభవించాడు. అయితే ఆ జైలు శిక్షా కాలంలో అతని తల్లి మరణించడంతో..  కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అతను జైలు నుండి ముందే విడుదలయ్యాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను  ఇరుగుపొరుగు వారు హేళన చేస్తున్నారన్న క్షక్ష, పగ పెంచుకుని 2015 డిసెంబర్ 24వ తేదీన ఒక ఇనుప పైపుతో  పొరుగువారిపై   దాడికి తెగబడ్డాడు. ఈ  దాడిలో ఏడిద విజయలలిత, గెడ్డం నాగభూషణం, ఖండవల్లి కుమారి అనే ముగ్గురు మరణించారు. ఈ నేరానికి గాను ఏడిద ఆనందకుమార్ కు శిక్ష పడింది.    తీవ్రమైన నేర స్వభావం ఉన్న ఇలాంటి నింది తుడు ఎలాంటి ఉపశమనానికి లేదా క్షమాభిక్షకు అర్హుడు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ అతని పిటిషన్ ను కొట్టివేసింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...