రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. అప్రూవర్ గా సునీల్ నాయక్?
posted on: Mar 6, 2026 3:34PM
.webp)
మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇంత కాలం విచారణకు దూరంగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు అనివార్యంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం (మార్చి 5) విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
విచారణలో సునీల్ నాయక్ అప్రూవర్ గా మారే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు సునీల్ నాయక్ అప్రూవర్ గా మారినా, మారకున్నా సునీల్ నాయక్ తన పరిధిమీరి వ్యవహరించారన్నది నిర్ద్వంద్వంగా తేలిపోయిందన్న డీవీ శ్రీనివాసరావు గుంటూరు సిఐడి కార్యాలయంలో రఘురామకృష్ణ రాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ నాయక్ నాలుగు సార్లు లోపలికి వెళ్లి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెప్పడాన్ని ఉటంకించారు.
అసలు రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో అప్పట్లో పోలీసుల తీరు మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకువచ్చిందని డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు తెలుగువన్ న్యస్ చానెల్ లో ఈ దిగువ ఇచ్చిన లింక్ లో వీక్షించండి.






