రాజధాని భూసేకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు...

posted on: Sep 25, 2014 8:06AM

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఆరుగురు మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీ వేసారు. అందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పి.నారాయణ, పల్లె రఘునాధ రెడ్డి మరియు రావెల కిషోర్ బాబు సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూసేకరణ చేయవలసి ఉంటుంది కనుక శ్రీకాకుళానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడును ఈ కమిటీ నుండి తప్పించారు.

 

అయితే భూసేకరణలో అత్యంత కీలకమయిన రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని మాత్రం ఈ కమిటీలో చేర్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మొదటి నుండి కూడా విజయవాడ వద్ద రాజధాని నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. బహుశః అందువల్లే ఆయన ఈ కమిటీలో చేరెందుకు నిరాకరించిఉండవచ్చును. అయితే ఈ అంశంపై ఆయన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో విభేదించినప్పటికీ ఈ కారణంగా ఆయన వారితో ఘర్షణ వైఖరి అవలంబించకపోవడం గమనిస్తే ఆయన కేవలం ఈ విధంగా తన నిరసనను తెలియజేసినట్లు భావించవచ్చు.

 

ఆయన రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కానీ అది సాధ్యపడదని గ్రహించిన తరువాత కర్నూలుకు, రాయలసీమ జిల్లాలకు వీలయినంత ఎక్కువ ప్రయోజనాలు చేకూరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బహుశః అందుకే విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించేటప్పుడు రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా అనేక వరాలు ప్రకటించారని భావించాల్సి ఉంటుంది. ఏమయినప్పటికీ ఈ భూ సేకరణ కమిటీలో కె.ఇ.కృష్ణమూర్తి లేకపోవడం ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం కల్పించవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...