సీనియర్ల వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
posted on: Mar 17, 2026 3:32PM
.webp)
సీనియర్ల వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని ఉన్న బనిగండ్లపాడుకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్న శ్రీవిద్య, యూనివర్సిటీ పరిధిలోని పద్మాక్షి హాస్టల్లో నివసిస్తేండేది.
ఆ క్రమంలో కొందరు సీనియర్లతో ఆమెకు వివాదం తలెత్తింది. ఈ వివాదం తర్వాత ఆమెపై దాడి జరిగిందనీ, అలాగే ల్యాప్టాప్, బంగారం చోరీ చేశారంటూ సీనియర్లు ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారనీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామాలతో శ్రీవిద్య తీవ్ర మనస్తాపానికి గురై తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. అనంతరం శ్రీవిద్య ఆంధ్రప్రదేశ్లోని గంపలగూడెంలో బంధువుల వద్ద ఉన్న సమయంలో ఈ నెల 7, 8 తేదీల్లో రెండు సార్లు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ముందుగా స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా, శ్రీవిద్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం (మార్చి 16) ఆమె మృతిచెందింది. శ్రీవిద్య మరణించే ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మృతికి ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలం లో నలుగురు వ్యక్తుల పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఘటనపై మదిర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ల వేధింపులే ఈ దుర్ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన నెలకొంది. విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్, వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.






