Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హర్మూజ్ జలసంధి పూర్తిగా ఓపెన్.. ఎప్పటి నుంచంటే?
posted on: Jun 16, 2026 9:38AM

హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుందని అగ్రరాజ్యధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం హర్మూజ్ జలసంధి' ఈ జూన్ 19 నాటికి.. అంటే వచ్చే శుక్రవారం నాటికి పూర్తిస్థాయిలో నౌకల రాకపోకల కోసం తెరుచుకోనుందని వెల్లడించారు. ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. జీ7 సదస్సులో భాగంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో జరిగిన ప్రత్యేక సమావేశంలో ట్రంప్ ఈ విషయాలను పంచుకున్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రపంచ శాంతికి, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో స్థిరత్వానికి ఎంతో కీలకమని అన్నారు. ఈ ఒప్పందం ఇరాన్ అణు సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని నమ్మకాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం విశేషాలను ట్రంప్ ఈ సందర్భంగా వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అత్యంత కఠినమైన నిబంధనలతో ఈ సరికొత్త ఒప్పందాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. దీనికి ఇరాన్ కొత్త నాయకత్వం పూర్తిగాఅంగీకరించిందన్నారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి పాక్షికంగా మాత్రమే తెరుచుకుందని.. ఈ నెల 19 నాటికి ఇది 1 పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి వస్తుందని ట్రంప్ చెప్పారు. ఈ డీల్కు సంబంధించిన అధికారిక పత్రాలను శుక్రవారం తర్వాతే ప్రపంచం ముందుకు తీసుకువస్తామన్న ఆయన ఈ ఒప్పందంపై అధికారిక సంతకాల ప్రక్రియను పూర్తి చేయడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా స్విట్జర్లాండ్ వెళ్తున్నారని ట్రంప్ ప్రకటించారు.
కాగా.. ఇరాన్, అమెరికా ఈ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే భరోసాతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. ఇదంతా ఇరాన్ శాంతి ఒప్పందం తెచ్చిన ఊరటగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. తన తదుపరి లక్ష్యం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడమేనన్నారు. ఇందుకోసం తాను ఇటీవలే రష్యా, ఉక్రెయిన్ దేశాల అధ్యక్షులతో ఫోన్ ద్వారా మాట్లాడానని.. త్వరలోనే ఆ సుదీర్ఘ యుద్ధానికి కూడా ముగింపు పాడుతామని ట్రంప్ పేర్కొన్నారు.






