కరుణానిధిని కలిసిన అళగిరి.... రెండేళ్ల తరువాత... ఎందుకో

posted on: Mar 24, 2016 4:41PM

తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఒకపక్క పీపుల్స్‌ వెల్ఫేర్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండగా, మరోపక్క సరైన అభ్యర్ధులను బరిలో నిలిపేందుకు జయలలిత తంటాలు పడుతున్నారు. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కకపోవచ్చుననే భయాలు వినిపిస్తున్నాయి. ఇక డీఎంకే కూడా తన కష్టం తాను పడుతోంది. ఒకప్పుడు తమిళనాట ఓ వెలుగువెలిగిన ఆ పార్టీ, కరుణానిధి కురువృద్ధునిగా మారిపోవడంతో కుదేలైపోయింది. ఆపత్కాలంలో ఉన్న తండ్రికి వెన్నంటి నిలుద్దామనుకున్నాడో ఏమో, కరుణ కుమారుడు అళగిరి రంగంలోకి దిగాడు. పార్టీకి తరచూ చెడ్డపేరు తెస్తున్నాడంటూ 2014లో అళగిరిని పార్టీనుంచి బహిష్కరించారు.

అప్పటి నుంచీ ఆయన తండ్రిని కూడా కలవడం మానేశాడు. తనకు సవతి తమ్ముడైన స్టాలిన్‌కు కరుణానిధి అధిక ప్రాధాన్యతని ఇవ్వడమే అళగిరి దుగ్ధకు కారణంగా ఉండేది. ఆ సందర్భంగా జరిగిన ఓ గొడవలోనే, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. కానీ అకస్మాత్తుగా అళగిరి తిరిగి తండ్రి చెంతకు చేరుకోవడంతో, వీరిద్దరి కలయిక గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. మంచో చెడో... అళగిరికి మధురైలో చాలా పలుకుబడే ఉంది. దక్షిణ తమిళనాడు మీద అతనికి మంచి పట్టుంది. కాబట్టి ఈ ఎన్నికలలో అళగిరిని తిరిగి డీఎంకేలోకి తీసుకుని, పార్టీని బలపర్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు ముంచుకువస్తే, పొత్తులే కాదు, బంధాలు కూడా మారిపోతాయన్నమాట.

google-ad-img
    Related Sigment News
    • Loading...