భక్త జనసంద్రంగా మారిన శ్రీశైలం
posted on Nov 17, 2025 9:24AM

అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం కార్తీక మాసం నాల్గవ సోమవారం (నవంబర్ 17) మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు పాలు, ప్రసాదాలు అందచేస్తున్నారు. ఆలయ పురవీధులన్నీ భక్తులతో సందడిగా మారిపోయాయి. ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోవడంతో భక్తులు మల్లన్న దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
ఇలా ఉండగా సోమవారం (నవంబర్ 17) సాయంత్రం జరగాల్సిన తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. . కార్తీక నాల్గవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.