Latest News

అసెంబ్లీ జరుగుతుంటే ఆటలేంటి ... ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు

posted on: Mar 26, 2026 9:50PM

 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకమైన పద్దులపై చర్చలతో కొనసాగుతున్న తరుణంలో, ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఇంత సీరియస్‌గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన కేటీఆర్, ఇదే విషయాన్ని తాను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇరిగేషన్ వంటి అత్యంత ముఖ్యమైన సబ్జెక్టులపై సభలో లోతైన చర్చ జరగాల్సి ఉందని, కానీ ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించి పారిపోవాలని చూస్తోందని విమర్శించారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు మైదానాల్లో ఆటలు ఆడుతుంటే చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారని ఆయన నిలదీశారు.

ముఖ్యంగా ఈ నెల 28, 29 తేదీల్లో ఈ క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కాలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పద్దులపై చర్చకు తగినంత సమయం కేటాయించకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. చర్చించాల్సిన కీలకమైన అంశాలు పక్కనపెట్టి…కేవలం ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ క్రీడా పోటీలను ఒక సాకుగా చూపిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...