Latest News
ఐపీఎల్ వేళ బెట్టింగ్ మాఫియాపై ప్రత్యేక పోలీసు నిఘా.. సీపీ సజ్జనార్
posted on: Mar 28, 2026 4:55PM
.webp)
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో.. క్రికెట్ ముసుగులో సాగే అక్రమ బెట్టింగ్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బెట్టింగ్ రాయుళ్లకు, నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్ను కేవలం ఒక క్రీడగా మాత్రమే చూడాలని, జూదంగా మార్చి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన యువతకు సూచించారు.
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న బెట్టింగ్ దందాపై ప్రత్యేక నిఘాకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్లను నిషేధించినప్పటికీ, ప్రస్తుతం టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా ఈ అక్రమ కార్యకలాపాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్న సజ్జనార్.. కేవలం కమిషన్ల కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
ఆన్లైన్ ద్వారానే కాకుండా.. రహస్య ప్రాంతాల్లో నిర్వహించే ఆఫ్లైన్ బెట్టింగ్లపై కూడా నిఘా పెట్టామన్నారు. ఫామ్ హౌస్లు, ఇతర రహస్య ప్రదేశాల్లో బెట్టింగ్ నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. బెట్టింగ్ వల్ల వచ్చే అప్పుల భారం తట్టుకోలేక ఎంతో మంది యువకులు రోడ్డున పడుతున్నారనీ, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ పేర్కొన్న సజ్జనార్ అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.
నగరంలో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెనుకాడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అలా సమాచారం ఇచ్చిన, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సజ్జనార్ ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో క్రికెట్ బెట్టింగ్ను అరికట్టడానికి మరిన్ని తనిఖీలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2026 సీజన్ అంతా సీజన్ అంతా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.






