Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కార్యాచరణ : మంత్రి పొన్నం
posted on: Jun 4, 2026 4:45PM
.webp)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలను సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితాను రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కమిటీ ఆదేశించింది.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ కే. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. కేవలం రాజకీయ పార్టీలకే కాకుండా విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ఉద్యమంలో భాగమైన వివిధ వర్గాలతో కూడా సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మొదటి దశలో ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ చేపడతామని, ముఖ్యంగా తొలి తరం ఉద్యమకారుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిటీ నివేదికను నిర్దిష్ట గడువులో ప్రభుత్వానికి అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమ సమయంలో గాయపడినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, జైలు శిక్ష అనుభవించినవారు, అలాగే కవులు, కళాకారులు, వివిధ రంగాల కార్యకర్తలను గుర్తించి గౌరవించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అమరవీరుల స్మారక స్థలం వద్ద కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఆయన, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో దరఖాస్తులు, విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివిధ జేఏసీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యమంలో తమ యవ్వనాన్ని, జీవితాన్ని అంకితం చేసిన వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా గుర్తించాలని సమావేశంలో పలువురు సూచించారని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినవారు, గాయపడినవారు, కేసులు ఎదుర్కొన్నవారందరినీ గుర్తించి గౌరవించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు.మొదటి దశలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న కమిటీ, తదుపరి దశలో అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది.


.webp)



