బండికి ‘సన్’ స్ట్రోక్

posted on: May 11, 2026 2:39PM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోస్కో  కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలీ కేసు ఏంటంటే.. 17 ఏళ్ల మైనర్ బాలికను భగీరథ్ లైంగికంగా వేధించారనీ, మోయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగిందని బాలిక తల్లి పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న జరిగిన పార్టీలో బాలికపై అత్యాచారం జరిగిందని..  ఆ తర్వాత ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

అయితే.. ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఓ  ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కుటుంబం తనను తప్పుడు కేసులతో బ్లాక్‌మెయిల్ చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇప్పటికే భయంతో రూ.50వేలు చెల్లించానని..  అయినా వారి వేధింపులు పెరిగిపోయాయని ఆ ఫిర్యాదులో ఆరోపించారు బండి బగీరథ్.  తాను పెళ్లికి నిరాకరించినందుకే ఈ కుట్ర పన్నారని అంటున్నారాయన. 

ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ న‌డుస్తోంది. బీజేపీ బేటీ బచావో నినాదంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఇతర పార్టీల నేతలపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించేవారు. ఇప్పుడాయన కుమారుడిపైనే కేసు నమోదు కావడంతో.. ప్రతిపక్షాలు..  నెటిజన్లు  బేటీ బచావో కాదు.. బేటా బచావో.. అంటే కొడుకును ముందు కాపాడుకో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

ప్రధాని మోడీని ఉద్దేశించి..  మీ శిష్యుడి కొడుకు అరాచకాలు చూడండి అనేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ శత్రువులు బండి సంజయ్‌ను నైతికంగా దెబ్బతీయడానికి ఈ కేసును వాడుకుంటున్నారు. ఇక‌ బీఆర్ఎస్ నేతలు, ఇత‌ర‌ మహిళా సంఘాలు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతానికి పోలీసులు రెండు ఫిర్యాదులను వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఫైన‌ల్ గా పోలీసుల వెర్షన్ ఏంటంటే..  ఇది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కుమారుడి  కేసు కావ‌డంతో సునిశిత‌మైన వ్య‌వ‌హారం. బాలిక మైనర్ అని తేలడంతో ప్రాథమికంగా అయితే ఎలాంటి  సందేహాలకూ తావు లేకుండా.. పోక్సో కేసు నమోదు చేశామని, అయితే బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. డిజిటల్ ఆధారాలైన చాటింగ్స్, ఫోన్ కాల్స్.. ఈ కేసులో కీలకం కానున్నాయంటున్నారు.

రాజకీయంగానూ ఇలాంటి కేసులు ప్ర‌త్య‌ర్ధుల ప్ర‌ధానాస్త్రాలుగా మారుతుంటాయి. ఇది రాజకీయ కుట్ర అని బీజేపీ వర్గాలు అంటుంటే..  చట్టం తన పని తాను చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలోకి వెళ్లనుంది. ఒకవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోవైపు  హనీ ట్రాప్  ఆరోపణలు.. ఈ రెండింటిలో ఏది నిజమనేది పోలీసుల  దర్యాప్తులో తేలాల్సి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...