రాజుగారు ఇప్పుడైనా తగ్గితే మంచిది....
posted on: Jan 31, 2018 10:40AM

గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ నేతల్లో అందరి సంగతేమో కానీ... ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే కదా. సందు దొరికితే చాలు టీడీపీ పై విరుచుకుపడటం.. మిత్రపక్షం అని కూడా చూడకుండా రెచ్చిపోయి మాట్లాడటం.. ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ నేతలతో కూడా ఆయన బాగానే రాసుకుపూసుకు తిరుగుతున్నారు. దీంతోరాజుగారి వైఖరి వల్ల సొంత పార్టీనుండే గట్టి షాక్ తగిలింది. సొంతపార్టీ నేతలే అధిష్టానానికి మొత్తం సోము వీర్రాజు ఎపిసోడ్ అంతటినీ తీసుకొని వెళ్లి ప్రదర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి వద్దకు వెళ్లి... పేపర్లలో, టీవీల్లో కనిపించడం కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ పార్టీ పరువును తీస్తున్నాడని ఫిర్యాడు చేశారట.
ఈ సందర్బంగా ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు మాట్లాడుతూ....వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు రింగు తిప్పినట్టు ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకవు అక్కడ ఉన్నది వాజ్ పేయి కాదు అని సోము వీర్రాజు అనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసలు సోము వీర్రాజుకు వాజ్ పేయి పేరెత్తే అర్హత లేదని... వైసీపీతో సోము వీర్రాజు సంబంధాలే కాదు ఇంకా చాలా చాలా సంబంధాలు ఉన్నాయని అవన్నీ ఎప్పుడు, ఎక్కడ ఎలా బయటపెట్టాలో త్వరలోనే అవన్నీ చేస్తామని తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. మరి తాడి తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు అన్న సామెత ప్రకారం... సోము వీర్రాజుగారు ఏదో చేద్దామనుకొని ఆఖరికి సొంత పార్టీనేతలనుండి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మరి అమిత్ షా సోము వీర్రాజు పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇక రాజుగారు ఇప్పుడైనా నోటిని కంట్రోల్ లో పెట్టుకుంటారో...? లేదో..? చూద్దాం...






.webp)



