ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్.. ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా!

posted on: Apr 17, 2026 3:29PM

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన   ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు స్లో ఓవర్ రేట్ ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. నిర్ణీత సమయం కంటే గంటల తరబడి మ్యాచ్ లు కొనసాగుతూ ఉండడానికి, ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారడానికి స్లో ఓవర్ రేట్ కారణమంటున్నారు క్రికెట్ పండితులు.  స్లో ఒవర్ రేట్ కు ప్లేయర్లకు జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదంటున్నది  మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. ఎంసీపీ క్రికెట్ విభాగం అధిపతి ఫ్రేజర్ స్టీవర్ట్  అయితే.. స్లో ఓవర్ రేట్ సమస్యకు ఆటగాళ్లను మాత్రమే బాధ్యులను చేయడం  కాదని, దీనికి అంపైర్లను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సుమారు 4 గంటల 22 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచ్‌ను స్వయంగా వీక్షించిన స్టీవర్ట్.. ఆట సాగిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్ మార్పులు, ఆటగాళ్ల మధ్య చర్చలు, అనవసర విరామాల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.  ఈ నేపథ్యంలోనే ముంబైలో జరిగిన  ఒక కార్యక్రమంలో  మాట్లాడిన ఆయన.. అంపైర్ల ఉదాశీనత వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదైతే కేవలం జట్టు కెప్టెన్లకు లేదా ఆటగాళ్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నారు. కానీ మైదానంలో నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగిసేలా చూడాల్సిన బాధ్యత ఉన్న అంపైర్లకు కూడా జరిమానా విధించితేనే ఈ సమస్య పరిష్కారమౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 నియమావళిలో ఆట వేగాన్ని మందగింప చేసేలా వ్యవహరిస్తున్న ఆటగాళ్లకు, జట్లకు హెచ్చరికలు చేసే అధికారం, ఐదు పరుగుల పెనాల్టీ విధించే అధికారం, అవకాశం అంపైర్లకు ఉందనీ, వారు మాత్రం ఆ అధికారాన్నీ, అవకాశాన్ని ఉపయోగించకుండా ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే స్లో ఓవర్ రేట్ సమస్య తలెత్తుతోందని ఫ్రేజర్ స్టీవర్ట్  విమర్శించారు. అంపైర్లు కఠినంగా వ్యవహరించనంత కాలం మ్యాచ్‌లు ఇలాగే సాగుతాయని, ఒకవేళ ఓవర్ రేట్ తగ్గితే అంపైర్ల వేతనంలో కోత విధించేలా నిబంధనలు తీసుకువస్తే మార్పు వస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను బీసీసీఐకి కూడా చెప్పానని తెలిపాడు.  చూడాలి మరి ఎంసీసీ ప్రతిపాదనపై బీసీసీ ఎలా స్పందిస్తుందో?

google-ad-img
    Related Sigment News
    • Loading...