TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫొన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు మళ్లీ నోటీసులు?

Published on: Wed Jan 21, 2026 9:17AM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు  ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం (జనవరి 20) దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్.. ఆయనకు మరో మారు నోటీసులు జారీ చేయనుంది. మంగళవారం (జనవరి 20) విచారణ సందర్భంగా హరీష్ రావు తన కుమారుడు విదేశాలకు వెళ్తున్నందున సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని   రిక్వెస్ట్ చేయడంతో  ఏడున్నర గంటల తరవాత విచారణ ముగించామనీ, ఆయనను ఇంకా విచారించాల్సిన అవసరం ఉందనీ సిట్ వర్గాలు చెబుతున్నాయి. సిట్ చీఫ్ సజ్జనార్ హరీష్ రావు విచారణ ముగిసిన తరువాత చేసిన ప్రకటన కూడా అదే సూచిస్తోంది. 

ఇలా ఉండగా మంగళవారం (జనవరి 20) విచారణ ముగిసిన తరువాత బయటకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సిట్ సూచనలను పట్టించుకోకుండా  మీడియా ముందు పొలిటికల్ కామెంట్స్ చేశారు. అది పక్కన పెడితే.. విచారణలో భాగంగా హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించినట్లు తెలుస్తోంది.  

కాగా మంగళవారం (జనవరి 20) విచారణ అర్ధంతరంగా ముగియడంతో రెండు మూడు రోజులలో హరీష్ రావును సిట్ మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే.. సుప్రీంకోర్టు కొట్టి వేసిన కేసులో హరీష్ రావును విచారణకు పిలిచారంటూ కేటీఆర్ సహా  బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సిట్ చీఫ్  సజ్జనార్ ఖండించారు. తాము హరీష్ రావును విచారణకు పిలిచింది ఆ కేసులో కాదని క్లారిటీ ఇచ్చారు.  ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో హరీష్ రావును విచారించామనీ, ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సజ్జనార్ అన్నారు.