మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ దర్యాప్తు

posted on: Mar 17, 2026 10:26AM

మొయినాబాద్‌ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ కేసు మూలాలను వెలికితీసేందుకు  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్  పార్టీలో డ్రగ్స్ వాడకంతో పాటు,  వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించే లక్ష్యంతో ముందుకు సాగనుంది. 

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన విందులో అసలేం జరిగింది? డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే అంశాలపై సిట్ అధికారులు దృష్టి సారించనున్నారు.  ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్యంగా దుబాయ్ లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవడమే లక్ష్యంగా సిట్ ఏర్పాటైంది.  ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న నిమిద్ శర్మకు సంబంధించిన వ్యాపార లావాదేవీలపై కూడా సిట్ ఆరా తీయనుంది.  

రియల్ ఎస్టేట్ రంగంలో సాగుతున్న ఆర్థిక లావాదేవీలకు, డ్రగ్స్ దందాకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో  సిట్ విచారణ సాగనుందని అంటున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పడిన ఈ కమిటీ దర్యాప్తు పూర్తయిన తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.  సిట్ ఏర్పాటు ద్వారా   ఈ కేసులో నిందితులు  ఎవరైనా, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చినట్లు భావిస్తున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...