ఫోన్ ట్యాపింగ్ కేసులో చికోటి ప్రవీణ్‌కు సిట్ నోటీసులు

posted on: Jun 19, 2026 10:07AM

 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది.

గతంలో తన మొబైల్ ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ చికోటి ప్రవీణ్ అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ను అప్పటి ఎస్‌ఐబీ అధికారి రాధాకిషన్ రావు అక్రమంగా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదును ఎస్‌ఐటీ అధికారులు దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తుండగా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను గుర్తించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన పరిస్థితులు, దాని వల్ల ఎదురైన ఇబ్బందులు, అలాగే అప్పట్లో సమర్పించిన ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసుకునేందుకు చికోటి ప్రవీణ్‌ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, అవసరమైతే సంబంధిత ఆధారాలు, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక వివరాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది.

గత ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎస్‌ఐటీ విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు, బాధితులు, సాక్షులను విచారించిన దర్యాప్తు బృందం కేసులోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. చికోటి ప్రవీణ్ విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అయితే, దీనిపై ఎస్‌ఐటీ నుంచి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...