చెల్లెలి మార్ఫింగ్ ఫోటోలతో అన్నకు బెదిరింపులు...యువకుడి అరెస్ట్

posted on: May 30, 2026 11:46AM

 

చెల్లెలి మార్ఫింగ్ నగ్నచిత్రాలతో అన్నకు బ్లాక్‌మెయిల్.. 

యువకుడి గుట్టురట్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

భాగ్యనగరంలో సాంకేతికతను అడ్డుపెట్టుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న నయా సైబర్ నేరగాళ్ల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తనతో మాట్లాడటం లేదనే కక్షతో ఓ యువతి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేయడమే కాకుండా.. వాటిని ఏకంగా ఆమె సోదరుడికే పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన కిలాడీ యువకుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

బాధిత యువతి, నిందితుడు ఒకే కాలేజీలో చదువుకుంటూ కొంతకాలం పాటు స్నేహితులుగా మెలిగారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని సాధారణ ఫోటోలు, వీడియోలు సదరు యువకుడి మొబైల్‌లో ఉన్నాయి. అయితే, కాలక్రమేణా అతడి నడవడిక, ప్రవర్తనలో తేడా రావడంతో సదరు యువతి అప్రమత్తమైంది. అతడితో స్నేహాన్ని తెంచుకుని పూర్తిగా మాట్లాడటం మానేసింది.

తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు తీవ్ర కక్ష పెంచుకున్నాడు. మళ్లీ మాట్లాడాలంటూ పలుమార్లు వేధించినా యువతి లొంగకపోవడంతో దారుణమైన ప్లాన్ వేశాడు. తన వద్ద ఉన్న ఆమె ఫోటోలను అధునాతన టెక్నాలజీ సాయంతో నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ వికృత ఫోటోలను నేరుగా యువతి అన్న మొబైల్‌కు పంపించి బ్లాక్‌మెయిల్ కల్చర్‌కు తెరలేపాడు.

తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే ఈ మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేసి వైరల్ చేస్తానంటూ సదరు సోదరుడిని బెదిరించాడు. ఈ ఊహించని పరిణామంతో సదరు కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. చివరకు ధైర్యం చేసి, ఇలాంటి సైకోలకు బుద్ధి చెప్పాలని భావించి పోలీసులను ఆశ్రయించారు.

ఈ కేసు దర్యాప్తులో పోలీస్ యంత్రాంగం స్పందించిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత బాధితులు నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, సాంకేతిక పరిధి కారణాల వల్ల వారు జవహర్‌నగర్ పీఎస్‌కు రిఫర్ చేశారు. అక్కడ జవహర్‌నగర్ పోలీసులు తక్షణం స్పందించి 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేసి, తదుపరి వేగవంతమైన చర్యల కోసం కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

రంగంలోకి దిగిన మేడ్చల్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక ఆధారాలు, ఐపీ అడ్రస్, మొబైల్ డేటా సాయంతో నిందితుడి గుట్టురట్టు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిజిటల్ యుగంలో మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసినా, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడినా చట్టం దృష్టిలో తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన శిక్షలు పడేలా చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...