Latest News

హైదరాబాద్‌లో లంచం తీసుకుంటూ ఎస్ఐలు అరెస్ట్

posted on: Mar 9, 2026 6:43PM

 

హైదరాబాద్‌లో ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్న అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్‌డ్‌ రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడికి నోటీసులు ఇవ్వడానికి బాధితుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశారు.

సోమవారం ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద బాధితుడి నుంచి రూ.1 లక్ష లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్–2 అధికారులు బాబు నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రమోద్ గౌడ్ కూడా ప్రమేయం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.అధికారులు నిందితుల వద్ద నుంచి రూ.1 లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. 

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఎస్ఐలను అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం  ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.ఇటీవల తెలంగాణలో పలువురు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ప్రజలను అధికారులు కోరారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...