సింగర్ మంగ్లీ డీజీపీకి ఫిర్యాదు...“స్కామ్‌లతో నాకు సంబంధం లేదు”

posted on: Apr 15, 2026 8:48PM

 

తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లిన మంగ్లీ, డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీ మహేష్ భగవత్‌కు అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు.గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని మంగ్లీ తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

“పాటలు తప్ప స్కామ్‌లు తెలియవు”

ఈ సందర్భంగా మంగ్లీ భావోద్వేగంతో మాట్లాడారు.“పాటలు తప్ప నాకు స్కామ్‌ల గురించి తెలియదు. నేను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. పేదరికం నుంచి వచ్చిన నేను డబ్బు విలువ బాగా తెలుసు. గత నెల రోజులుగా నా ప్రోగ్రామ్‌లు, రికార్డింగ్స్ కూడా వదులుకున్నాను. ఈ వివాదం ప్రజల్లోకి తప్పుగా వెళ్తోంది. నిజమైన బాధితులకు నేను ఎప్పటికీ అండగా ఉంటాను” అని తెలిపారు.ఈ వ్యవహారంలో మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు, సుబ్బారావుపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

న్యాయవాది ఆరోపణలు

మంగ్లీ తరఫు న్యాయవాది కూడా కీలక ఆరోపణలు చేశారు.“నేరగాళ్లే బాధితుల రూపంలో పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. అసలు స్కాం చేసిన వారే మీడియా ముందుకు వచ్చి బాధితులుగా మాట్లాడుతున్నారు” అని ఆరోపించారు.అలాగే, “సుభాక్షేత్ర బిజినెస్ అనే పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి మధు ఎండీగా ఉన్నాడు. ప్రస్తుతం బాధితుడిగా మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి అదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ స్కాం వ్యవహారానికి మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించే అవకాశముందని సమాచారం.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...