జగన్నాటకం..పరామర్శయాత్ర పేర బలప్రదర్శన!

posted on: Feb 5, 2026 9:04AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన పర్యటనలను కొత్త టూరిజం కనిపెట్టినట్లున్నారు. ఇప్పటి వరకూ మనకు మెడిక‌ల్ టూరిజం, ఎడ్యుకేష‌న‌ల్ టూరిజం, స్పిరిట్యువల్ టూరిజం ఇవే తెలుసు.. కానీ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కొత్తగా పరామర్శ టూరిజంను కనిపెట్టారు.  వాస్తవంగా చెప్పాలంటే జగన్ రాజకీయమే ఈ పరామర్శ టూరిజంతో ఆరంభమయ్యింది.

అది అచ్చొచ్చి.. ఇక ఆయన దానిని కంటిన్యూ చెస్తున్నారు.  జగన్ తాను జనంలోకి వచ్చి బలప్రదర్శన చేయాలని అనుకుంటే..  అంబటి లాంటి నేతలను పురిగొల్పుతారు. వారు ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేసి కేసులు, అరెస్టులు ఆలా ప్రభుత్వం ఏదో ఒక చర్యతీసుకోక తప్పని పరిస్థితి తీసుకువస్తారు. ఇందుకోసమే వేచి చూస్తున్న జగన్ వెంటనే రంగంలోకి దిగుతారు. రోడ్లపైకి వస్తారు.  రాసుకొచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ప్రత్యర్థులపై విమర్శలు కురిపించి వెళ్లిపోతారు.  ఈ మొత్తం అంతా ఒక వీధినాటకాన్ని తలపించేలా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. 

 మూమూలుగా ఒక నానుడి ఉంది. అబద్ధాలాడేవారికి జ్ణాపకశక్తి ఎక్కువ ఉండాలి అని. ఎందుకంటే..  ఏ  అబ‌ద్దం ఎక్క‌డ చెప్పారో గుర్తుండాలి.   అందుకే జగన్ స్క్రిప్ట్ మీద ఆధారపడతారని అంటున్నారు. అంబటి కుటుంబానికి పరామర్శ అంటూ జ‌గ‌న్ చేసిన యాత్రతో ఆ విషయం మరోసారి తేటతెల్లమైపోయింది.  జ‌గ‌న్ అక్క‌డ తాను రోడ్ల మీద‌కొచ్చే ప‌రిస్థితి లేక పోయినా.. అలాంటి వాతావ‌ర‌ణం క‌ల్పించి మ‌రీ వ‌స్తున్నారు. గ‌తంలో అంటే అధికారం ఉండేది. అధికారం ఉండ‌గా.. బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాలుండేవి. వాటి నిర్వ‌హ‌నకంటూ  త‌ల‌శిల ర‌ఘురాం అంటూ ఒక ఎమ్మెల్సీ. ఆయ‌న‌ కింద కొంత మందీ మార్బ‌లం ఉండేది.

ఇప్పుడు అధికారంలో లేక పోవ‌డంతో.. ఇలాంటి వారికంటూ  ప‌నిక‌ల్పించాలి  క‌దా? అందుకే అంబ‌టి, జోగి  రమేష్ వంటి వారితో  అనుచిత వ్యాఖ్యలు చేయించి, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ఆ చర్యలను సాకుగా చూపి ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు.  బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.  

ఇక జగన్ కు నేరాలకు పాల్పడిన తన పార్టీ వారికి అండగా నిలబడే విషయంలో హేతువు అంటూ ఉండదు. ఇప్పుడు జోగి రమేష్ ఇంటిపై దాడి అంటూ గగ్గోలు పెడుతున్న జగన్.. గతంలో అంటే తాను అధికారంలో ఉన్న సమయంలో  ఇదే జోగి రమేష్ ద‌గ్గ‌రుండి మరీ తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నివాసంపై దాడికి నాయకత్వం వహించినప్పుడు ఎందుకు నోరేత్తలేదు? అన్న ప్రశ్నకు వైసీపీయులు సమాధానం చెప్పరు. అధికారంలో ఉన్నా లేకున్నా.. దాడులు, దౌర్జన్యాలపై గుత్తాధిపత్యం మాదేనన్న భావనతో వారు ఉంటారు. అలా ఉండేలా చేస్తారు జగన్.  పరామర్శల పేరు జగన్ ఆడే వీధినాటకంలో పాత్రధారులను ఆడించే సూత్రధారి జగన్ . తన పార్టీలో నోరున్న వారిని రెచ్చగొట్టి,  ఏదో ఒక అల‌జ‌డి సృష్టించేలా చేసి,  ఆపై రోడ్డు మీద‌కొచ్చి బలప్రదర్శనకు దిగడం అన్నది జగన్ కు ఒక ఆనవాయితీగా మారిందంటున్నారు పరిశీలకులు.  రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు జగన్ పరామర్శల పేర చేసే వీధి ప్రదర్శనలు మరిన్ని చూడక తప్పదంటున్నాయి రాజకీయవర్గాలు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...