థాయ్‌లాండ్‌లో కాల్పులు… 34 మంది మృతి

posted on: Feb 11, 2026 6:35PM

 

థాయ్‌లాండ్‌లోని ఓ డేకేర్ సెంటర్‌లో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటనలో 22 మంది చిన్నారులు, 12 మంది టీచర్లు కలిపి మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. పిల్లల కేకలు, తుపాకుల శబ్దాలతో ఆ ప్రాంతం మొత్తం భయానకంగా మారింది. అనుమానితుడిని 18 ఏళ్ల ఖేమ్‌గా గుర్తించారు. స్కూల్‌కు సమీపంలోనే ఉండే ఇంట్లో అతడు నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడికి తల్లితో గొడవ జరిగినట్లు, హింసాత్మక ప్రవర్తన ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లితో గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఖేమ్ పోలీసుల వద్ద ఉన్న M4 రైఫిల్‌ను లాక్కుని పారిపోయాడు. నేరుగా సమీపంలోని స్కూల్ మైదానంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. తన చెల్లిని క్రమశిక్షణలో ఉంచాలని ప్రయత్నించిన ఓ టీచర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాల్పులు జరిపిన అనంతరం ఖేమ్ స్కూల్ భవనంలోకి ప్రవేశించి ఓ మహిళా సిబ్బందిని బందీగా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న అదనపు పోలీసు బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని స్కూల్ పరిసర ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టాయి. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ముగిసే వరకు స్కూల్‌కు దూరంగా ఉండాలని సిబ్బంది, స్థానికులను పోలీసులు కోరారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర వైద్య బృందాలను పంపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దాదాపు నాలుగేళ్ల కిందట కూడా ఓ మాజీ పోలీస్ అధికారి స్కూల్‌లోకి ప్రవేశించి మారణహోమానికి పాల్పడిన ఘటన థాయ్‌లాండ్‌ను షాక్‌కు గురిచేసింది. తాజా ఘటనలో కూడా ఎక్కువ మంది చిన్నారులే మృతిచెందడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. స్కూల్ పిల్లల భద్రత, యువత చేతుల్లోకి ఆయుధాలు ఎలా వస్తున్నాయన్న అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...