శివసేన సెల్ఫ్ గోల్

posted on: Nov 10, 2014 8:59AM

 

శివసేనకు మహారాష్ట్రలో బలమైన క్యాడర్ ఉంది. బీజేపీకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న శివసేన కు హఠాత్తుగా ఏమైందో ఏమో... అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకుంటున్నారు జనాలు. లేకపోతే బాల్ థాకరే ఉన్నప్పుడు ఎంత అటాకింగ్ గా ఉండేది. స్కెచ్చ్ వేస్తే అనుకున్నది జరిగిపోయేది. అంత కరెక్టుగా ఉండేది బాల్ థాకరే ఉన్నప్పుడు. గతంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు దీటైన పార్టీగా పేరు తెచ్చుకుంది. పాపం పెద్దాయన తర్వాత ఇప్పుడు పార్టీ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. మోడీ పవనాలు దేశంలో వీస్తున్నాయని తెలిసి కూడా ఉద్ధవ్ థాకరే ఎన్నికలకు ముందే పప్పులో కాలేశారు. బీజేపీ జాతీయ నేతలే ఎంత నచ్చజెప్పినా వినకుండా స్థానాల విషయంలో అనవసరంగా తెగేదాకా లాగారు. ఒంటరిగా పోయి బొక్క బోల్తా పడ్డారు. చెప్పుకోదగ్గ స్థానాలు సాధించలేక చతికిలపడ్డారు. పోనీ అప్పుడైనా తప్పును సవరించుకునే అవకాశం చిక్కింది శివసేనకు. ఎంచక్కా బీజేపీకి మద్దతిచ్చి మహారాష్ట్రలో మంత్రివర్గంలో చేరే ఛాన్సొస్సింది. దాన్ని కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే దానికి బలమైన కారణాలు లేవు. రాజకీయాల్లో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటే కుదరదన్న విషయం ఇంకా ఉద్ధవ్ కు తెలిసినట్టు లేదు. పోనీ ఇప్పుడు అద్వానీ లాంటి అగ్రనేతలు జోక్యం చేసుకుంటామంటున్నా పెద్దగా స్పందించడం లేదట. అటు మంత్రివర్గంలో చేరక... బీజేపీకి సపోర్టు ఇవ్వక ఏం చేయాలనుకుంటున్నారో శివసేన నేతలు. పోనీ కేంద్రమంత్రివర్గంలో చేరే బంపర్ ఆఫర్ ఇచ్చారు మోడీ. దాన్ని కూడా మిస్ చేసుకున్నారు. చివరకు చేసేది లేక బీజేపీ శివసేనకు కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకుందని సమాచారం. అదే జరిగితే నష్టం శివసేనకే తప్ప బీజేపీకి కాదంటున్నారు విశ్లేషకులు. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే తప్ప ముల్లుకు కాదనే విషయం ఇంకా ఉద్ధవ్ థాకరేకు అర్థం కాకపోవడం ... శివసేన నేతలనే విస్మయానికి గురిచేస్తోందట. బీజేపీని దూరం చేసుకోవడమంటే ఖచ్చితంగా సెల్ఫ్ గోలేనంటున్నారు పరిశీలకులు.

google-ad-img
    Related Sigment News
    • Loading...