శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు బెదిరింపు కలకలం
posted on: Feb 15, 2026 10:41AM

శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం సృష్టించింది. సింగాపూర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న సింగాపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎస్క్యూ–518 విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని కొందరు దుండగులు ఈ–మెయిల్ ద్వారా హెచ్చరిక పంపడంతో విమానాశ్రయ అధికారులు, భద్రతా విభాగాలు ఒక్క సారిగా అప్రమత్తమయ్యాయి .విమానానికి సంబంధించిన సమాచారం ఎయిర్పోర్ట్ అధికారులకు అందిన వెంటనే అత్యవసర ప్రోటోకాల్ను అమలు చేశారు.
విమానంగాల్లో ఉన్న సమయంలోనే భద్రతా బలగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆందోళనకు తావులేకుండా విమానాన్ని రన్వేపై దింపారు.ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను జాగ్రత్తగా ఒక్కొక్కరిని విమానం నుంచి దింపి ప్రత్యేక బస్సుల ద్వారా టెర్మినల్కు తరలించారు. అనంతరం విమానాన్ని అసోసియేషన్ ప్రాంతం కు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది సంయుక్తంగా విమానం లోపలి భాగాలు, లగేజ్ కంపార్ట్మెంట్లు, కార్గో విభాగాన్ని అన్ని చోట్ల క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు.
ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. బెదిరింపు మెయిల్ కారణంగా కొంతసేపు విమానాశ్రయం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పరిస్థితిని త్వరగా అదుపులోకి తీసుకువచ్చారు. ఇతర విమానాల రాకపోకలపై పెద్దగా ప్రభావం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకు న్నారు.ఈ ఘటనపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి పంపించారన్న దానిపై సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.
విదేశాల నుంచి ఉన్నాయా? లేక దేశీయంగా ఎవరైనా పంపించారా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. ఇటీవలి కాలంలో దేశంలోని పలు విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం భద్రతా సంస్థలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచడంతో పాటు టెర్మినల్ పరిసరాల్లో తనిఖీలు కొనసాగుతు న్నాయి.ప్రస్తుతం విమానంపై తనిఖీలు పూర్తయ్యాకనే తదుపరి చర్యలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.






