బండ్ల గణేష్ కు సుప్రీం లో చుక్కెదురు.!

posted on: Jul 23, 2026 3:37PM

టాలీవుడ్  నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.  తన కుటుంబానికి చెందిన    స్థిరాస్తి వేలం విషయంలో సుప్రీం కోర్టు బండ్ల గణేష్ పిటిషన్ ను తోసి పుచ్చింది.  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే.  అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.  

విషయమేంటంటే..  హైదరాబాద్‌లోని   శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనియన్ బ్యాంకులో తీసుకున్న  భారీ రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన తండ్రి,   సోదరుడు కలసి తమ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్ స్థిరాస్తిని వ్యక్తిగత పూచీకత్తుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తాకట్టు పెట్టారు.  రుణ చెల్లింపుల ప్రక్రియ సరిగ్గా సాగకపోవడంతో బ్యాంక్ అధికారులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. 2019వ సంవత్సరంలో సర్ఫేసీ చట్టం  కింద సదరు జూబ్లీహిల్స్ ఆస్తిని బ్యాంక్ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 2022లో వేలం నిర్వహించి   8.51 కోట్లకు ఆ ఆస్తిని విక్రయించింది.

బ్యాంక్ జరిపిన ఈ వేలం ప్రక్రియను  వ్యతిరేకిస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఎన్ సీఎల్ టీ)  ఆశ్రయించారు. ఎన్సీటీఎల్ లో కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ  కొనసాగుతున్న సమయంలో తమ పూచీకత్తు ఆస్తిని వేలం వేయడం చట్ట విరుద్ధమని బండ్ల గణేష్ వాదించారు. పైగా.. వన్ టైమ్ సెటిల్‌మెంట్  కింద తమ కుటుంబం ఇప్పటికే రూ. 71.44 కోట్లతో కలిపి మొత్తం సుమారు రూ. 129.02 కోట్ల బకాయిలను బ్యాంకుకు చెల్లించిందనీ.. బకాయిలన్నీ తీరిపోయాక కూడా ఆస్తిని వేలం వేయడం సరికాదని పేర్కొన్నారు.   ఈ వాదనలతో  ట్రిబ్యునల్  బండ్ల గణేష్‌కి అనుకూలంగా తీర్పునిస్తూ వేలాన్ని రద్దు చేసి, ఆస్తిని తిరిగి అప్పగించాలని, కొనుగోలుదారుకు సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది.

అయితే ఆ ఆదేశాలను సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య మరియు జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఈ కేసును సమగ్రంగా విచారించింది. బ్యాంకు తరఫున వాదనలు వినిపిస్తూ, ఎన్సీఎల్టీలో కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ నడుస్తున్నప్పటికీ, వ్యక్తిగత గ్యారెంటర్ల ఆస్తులపై ఆటోమేటిక్‌గా మారటోరియం రక్షణ వర్తించదని స్పష్టం చేశారు. ఈ వాదనలను ఆమోదించిన తెలంగాణ హైకోర్టు, డీఆర్‌టీ ఇచ్చిన ఉత్తర్వులను  రద్దు చేస్తూ యూనియన్ బ్యాంక్ చేసిన ఆస్తి వేలం చట్టబద్ధమైనదేనని సమర్థించింది. హైకోర్టు తీర్పును బండ్ల గణేష్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు కూడా   హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ..బండ్ల గణేష్ పిటిషన్ ను కొట్టివేసింది. 

Jubilee Hills Property Auction, Union Bank Of India Loan Case, Bandla Ganesh Court Case, Telangana High Court Order

google-ad-img
    Related Sigment News
    • Loading...