Latest News
నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురు
posted on: Mar 26, 2026 12:28PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. బ్యాంకు పేరుతో నకిలీ గ్యారెంటీలు ఉపయోగించి విదేశాల్లో రుణాలు పొందినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనినై సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందే.. అంటే 2018 జనవరిలో ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత 2019లో బ్రిటన్ లో అరెస్టైన విషయం తెలిసిందే.
కాగా అప్పటి నుంచీ ఆయనను భారత్ కు అప్పగింతపై కోర్టులో వ్యాజ్యం సాగుతోంది. ఈ కేసులో నీరవ్ మోడీకి లండన్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్కు అప్పగించే ప్రక్రియను నిలిపివేసి, కేసు విచారణను తిరిగి ప్రారంభించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను లండన్లోని హైకోర్ట్ ఆఫ్ జస్టిస్, కింగ్స్ బెంచ్ డివిజన్ తిరస్కరించింది. కోర్టు తీర్పుతో నీరవ్ మోదీని భారత్కు రప్పించే ప్రయత్నాల్లో భారత దర్యాప్తు సంస్థలు కీలక ముందడుగు వేసినట్లైంది.
ఈ విచారణ సందర్భంగా సీబీఐ అధికారుల బృందం లండన్కు వెళ్లింది. అక్కడి క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాదులతో కలిసి నీరవ్ మోడీకి వ్యతిరేకంగా వాదనలు వినిపించింది. కాగా ఇరుపక్షాల వాదనలూ విన్న కోర్టు.. కేసు తిరిగి తెరిచేందుకు అవసరమైన అసాధారణ పరిస్థితులు ఏవీ లేవని అభిప్రాయపడింది.






