పొత్తు పొడిచింది.. తమిళనాట కాంగ్రెస్కు 28 సీట్లు
posted on: Mar 5, 2026 9:56AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం ఖాయమైంది. ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు జరిగింది. దీంతో పొత్తులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 28 స్థానాలలో పోటీ చేయనుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే కాంగ్రెస్ కు డీఎంకే 28 సీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా ఆఫర్ చేసింది. ఇందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది.
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. మొత్తంగా ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.
అదలా ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుంది. డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు ఆప్ నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపకాలపై ఆప్, డీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తమిళనాడు ఆప్ కన్వీనర్ ఎస్ఏఎన్ వశీగరణ్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే సమన్వయ కమిటీని కలిసామనీ, కొన్ని సీట్లు అడిగామని చెప్పారు. బీజేపీని అడ్డుకోవడానికి బలమైన కూటమి అవసరమన్న ఆయన గత పర్యాయం పార్లమెంటు ఎన్నికల్లో బలమైన విపక్ష కూటమి ఏర్పడిందని, అందులో ఆప్ కూడా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తామన్న ఆయన, ఈ విషయంపై ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో చర్చిస్తారన్నారు.





